రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు లైంగికంగా వేధిస్తున్నాడు

19 Jan, 2023 05:51 IST|Sakshi

బ్రిజ్‌భూషణ్‌ను తప్పిస్తేనే బరిలోకి...

ధర్నాకు దిగిన భారత మహిళా రెజ్లర్లు  

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ భారత స్టార్‌ మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ అయిన బ్రిజ్‌భూషణ్‌ సుదీర్ఘకాలంగా తమని లైంగికంగా వేధిస్తున్నారని స్టార్‌ రెజ్లర్లు వినేశ్‌ ఫొగాట్, సంగీత ఫొగాట్, సాక్షి మలిక్‌ సహా 30 మంది రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు దిగారు.

ఆయన నియంతృత్వాన్ని, ఆగడాలను అరికట్టేందుకు ప్రధానమంత్రి, హోం మంత్రి జోక్యం చేసుకోవాలని... అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తప్పించేదాకా ధర్నా విరమించబోమని, పోటీల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతక విజేత సరిత మోర్, సంగీతా ఫొగాట్, సత్యవర్త్‌ కడియాన్, జితేందర్, సుమిత్‌ మలిక్‌ తదితర రెజ్లర్లు ధర్నా చేశారు.

దేశానికి పతకాలు తెచ్చిన మేటి రెజ్లర్లు రోడ్డెక్కి నినదిస్తుంటే అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ మాత్రం ఈ ఆరోపణల్లో నిజం లేదని తేలిగ్గా కొట్టిపారేశారు. ఏ ఒక్కరినైనా తాను లైంగికంగా వేధించానని నిరూపిస్తే ఉరేసుకొంటానని బ్రిజ్‌భూషణ్‌ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన 66 ఏళ్ల బ్రిజ్‌భూషణ్‌ 2011 నుంచి డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఉన్నారు.

చదవండి: IND VS NZ 1st ODI: గిల్‌ హల్‌చల్‌.. పోరాడి ఓడిన న్యూజిలాండ్‌

మరిన్ని వార్తలు