ఇన్ని రోజులు రెస్ట్‌ తీసుకున్నా.. రేపు వీల్‌చైర్‌లో ఉంటానేమో

26 May, 2021 15:40 IST|Sakshi

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జిమ్మీ నీషమ్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. కాస్త సమయం దొరికినా ఫన్నీ ట్వీట్స్‌తో రెచ్చొపోతాడు. తాజాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దు కావడంతో స్వదేశానికి చేరుకున్న నీషమ్‌ ఆంక్లాండ్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు. 336 గంటల క్వారంటైన్‌ను పూర్తి చేసుకొని మంగళవారం తన ఇంటికి చేరుకున్న నీషమ్‌ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. నాలుగు వారాల తర్వాత బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేశాడు. అలాగే మూడు నెలల తర్వాత గోల్ప్‌ ఆడాడు. అలా తొలిరోజు గడిచిపోయింది.

ఇక నేటి ప్లాన్స్‌ ఎంటో నీషమ్‌ ట్విటర్‌ ద్వారా రివీల్‌ చేశాడు. '' మూడు వారాల తర్వాత జిమ్‌ సెషన్‌లో అడుగుపెడుతున్నా.. కొన్ని రోజుల పాటు మంచి రెస్ట్‌ తీసుకున్న నేను ఇలా అన్ని ఒకేసారి మొదలుపెట్టేశా. ఒకవేళ నా శరీరంపై భారం పడితే మాత్రం రేపు కచ్చితంగా వీల్‌చైర్‌లో ఉంటానేమో'' అంటూ ఫన్నీ ట్వీట్‌ చేశాడు. అయితే నీషమ్‌ ట్వీట్‌పై ఒక అభిమాని స్పందించాడు. '' నీషమ్‌ వీల్‌చైర్‌కు పరిమితమైనా.. చేతులతో చేసే ఎక్సర్‌సైజులు చాలానే ఉన్నాయి.. వాటి సంగతేంటి'' అని అడిగాడు. దీనికి నీషమ్‌.. '' మనం ప్రశాంతంగా ఉన్నామన్న ఈ ట్విటర్‌ మనల్ని అలా ఉంచేలా లేదు'' అంటూ బదులిచ్చాడు. 

కాగా నీషమ్‌ ఐపీఎల్‌ 2021లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే అతను ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేకపోయాడు. కరోనా మహమ్మారి సెగతో లీగ్‌ రద్దు కావడంతో నీషమ్‌ స్వదేశానికి వచ్చేశాడు. కాగా జూన్‌లో టీమిండియా, కివీస్‌ మధ్య ఇంగ్లండ్‌లో జరగనున్న ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు నీషమ్‌ ఎంపిక కాలేదు. నీషమ్‌ కివీస్‌ తరపున టెస్టు మ్యాచ్‌ ఆడి నాలుగు సంవత్సరాలైంది. 2014లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన నీషమ్‌ 12 టెస్టులు మాత్రమే ఆడాడు. ఈ 12 టెస్టుల్లో 709 పరుగులు చేసిన నీషమ్‌ బౌలింగ్‌లో 14 వికెట్లు తీశాడు. అయితే పరిమిత ఓవర్ల ఆటలో మాత్రం కొనసాగుతున్నాడు.  66 వన్డేలాడి 1320 పరుగులతో పాటు 68 వికెట్లు, 29 టీ20లు ఆడి 324 పరుగులు సాధించాడు.
చదవండి: పిచ్చి ప్రశ్న.. జట్టులోనే లేను.. నేనెలా తీస్తాను 

వైరల్‌: విచిత్రరీతిలో బ్యాట్స్‌మన్‌ రనౌట్‌‌‌‌‌

మరిన్ని వార్తలు