Marco Jansen: దేశం కోసం ఆడేటప్పుడు తగ్గేదే ఉండదు.. బుమ్రాతో వాగ్వాదంపై సఫారీ బౌలర్‌ స్పందన

18 Jan, 2022 09:30 IST|Sakshi

Jansen On Altercation With Bumrah: దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌ను 1-2తేడాతో కోల్పోయిన టీమిండియా రేపటి(జనవరి 19) నుంచి ప్రారంభంకానున్న వన్డే సిరీస్‌ కోసం సన్నద్ధమవుతుంది. మ్యాచ్‌ వేదిక అయిన బోలాండ్‌ పార్క్‌లో ఇదివరకే ప్రాక్టీస్‌ షురూ చేసిన భారత జట్టు.. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, కోచ్‌ ద్రవిడ్‌ల ఆధ్వర్యంలో కఠోరంగా శ్రమిస్తుంది.

మరోవైపు దక్షిణాఫ్రికా సైతం ప్రాక్టీస్‌లో బిజీబిజీగా గడుపుతోంది. టెస్ట్‌ సిరీస్‌ గెలిచిన ఊపులో వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. టెస్ట్‌ సిరీస్‌లో 19 వికెట్లతో చెలరేగిన సఫారీ లెఫ్ట్‌ ఆర్‌ పేసర్‌ మార్కో జన్సెన్‌ వన్డే సిరీస్‌లోనూ సత్తా చాటేందుకు చమటోడుస్తున్నాడు. నిన్నటి ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా జన్సెన్‌ మీడియాతో మాట్లాడుతూ.. రెండో టెస్ట్‌లో బుమ్రాతో జరిగిన వాగ్వాదంపై స్పందించాడు. 

బుమ్రా, నేను మంచి స్నేహితులమంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నప్పుడు బుమ్రా తనకు బాగా సహకరించాడని గుర్తు చేసుకున్నాడు. తామిద్దరం మంచి స్నేహితులమే అయినప్పటికీ మైదానంలో ఎదురెదురు పడ్డప్పుడు, దేశం కోసం ఆడుతున్నప్పుడు మాత్రం తగ్గేదే ఉండదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంలో బుమ్రా సైతం ఇలానే వ్యవహరిస్తాడని అన్నాడు. జొహన్నెస్‌బర్గ్‌ టెస్ట్‌లో వాగ్వాదం వేడి మీద జరిగిందని, ఆ విషయాన్ని తామిద్దరం అప్పుడే వదిలేశామని, మా ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని వివరించాడు. 

ఇక, వన్డే సిరీస్‌ గురించి మాట్లాడుతూ.. టెస్ట్‌ సిరీస్‌ నెగ్గామని తాము రీలాక్స్‌ కావడం లేదని, టీమిండియా ప్రపంచంలో మేటి జట్టు అనడంలో ఏమాత్రం సందేహం లేదని, ఆ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయడం లేదని చెప్పుకొచ్చాడు. కాగా, 21 ఏళ్ల జన్సెన్‌ టీమిండియాతో వన్డే సిరీస్‌ ద్వారా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అరంగేట్రం చేయనున్నాడు. 
చదవండి: కెప్టెన్సీపై బుమ్రా ఆసక్తికర కామెంట్‌!
 

మరిన్ని వార్తలు