వేరే జట్లకు చేయగలడా.. ఆ అవసరం నాకు లేదు: రోహిత్‌

21 Nov, 2020 16:39 IST|Sakshi

బెంగళూరు: గత కొన్ని రోజులుగా కండరాల గాయంతో బాధపడుతున్న టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)లో ఉన్నాడు. బోర్డు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తన గాయంపై చెలరేగుతున్న వివాదంపై రోహిత్‌ శర్మ పెదవి విప్పాడు. ‘ గాయం నుంచి ఎప్పటికి కోలుకుంటాను అనేది నాకైతే తెలీదు. కాకపోతే రోజురోజుకి మెరుగువుతున్న విషయం తెలుస్తుంది. నా గాయం గురించి ఎప్పటికప్పుడు బీసీసీఐకి ముంబై ఇండియన్స్‌కి తెలియజేస్తూనే ఉన్నా. ఇంకా 25 రోజుల పాటు శ్రమిస్తే తిరిగి కోలుకునే అవకాశాలు ఉన్నాయి. నేను ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌ల సమయానికి ఫిట్‌ అవుతానని అనుకుంటున్నాను. కానీ నా ఫిట్‌నెస్‌పై ఇతరులు రకరకాలు కామెంట్లు చేస్తూ వివాదం చేస్తున్నారు. ఒక్కసారి నా మైండ్‌ క్లియర్‌ అయితే ఏమి చేయాలనేదానిపై ఫోకస్‌ ఉంటుంది. నేను ఆస్ట్రేలియాకు వెళ్లడం, వెళ్లకపోవడం అనేది ఫిట్‌నెస్‌ను బట్టే ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్న రాద్దాంతం అనవసరం’ అని రోహిత్‌ తెలిపాడు. (టీమిండియాకు ఇంకా క్లారిటీ లేదు: పాంటింగ్‌)

ఇక ముంబై ఇండియన్స్‌  ఐదుసార్లు చాంపియన్‌గా నిలవడంపై రోహిత్‌ శర్మ స్పందించాడు. ఇది ఓవర్‌నైట్‌లో సాధించిన ఘనత కాదని, దీని వెనుక ఎంతో శ్రమ ఉందని తెలిపాడు. మరొకవైపు ముంబై ఇండియన్స్‌ ఘనత కెప్టెన్‌ది కాదని,  ఆ జట్టులో ఆటగాళ్ల వల్లే అది సాధ్యమైందని కొంతమంది కామెంట్‌ చేశారు. దీనిపై రోహిత్‌ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.‘ మా జట్టులో పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్యా, బుమ్రా వంటి స్టార్లు ఉన్నారు. కానీ మేము ఎందుకు సక్సెస్‌ అయ్యాము అనేది ఎవరైనా ఆలోచించారా?, చాలా మంది ఏవేవో అంటున్నారు. మిగతా జట్లకు రోహిత్‌ ఇలా సక్సెస్‌ అందించగలడా? అని అడుగుతున్నారు. నేను వారికి మొదటిగా చెప్పేది ఒక్కటే..నేను ఎందుకు మిగతా జట్ల గురించి ఆలోచించాలి.. ఆ అవసరం ఏమి ఉంది. నేను ప్రస్తుతం ఉన్న ఫ్రాంచైజీతో ఒక సరైన దిశలో వెళుతున్నా. అదే డైరెక్షన్‌ను ఫ్రాంచైజీ కూడా కోరుకుంటుంది. నేను ఫ్రాంచైజీ ఆశించే దానిలో భాగం అవుతున్నా. అది సారథిగా కానీ, ఆటగాడు కానీ ఫ్రాంచైజీ నిర్దేశించిన మార్గంలోనే వెళుతున్నా’ అని రోహిత్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు