వచ్చేసారైనా భారత్‌ ఉంటుందా?

20 Dec, 2022 06:43 IST|Sakshi

92 ఏళ్ల ప్రపంచకప్‌ చరిత్రలో ఏనాడూ భారత్‌ నేరుగా అర్హత సాధించలేకపోయింది. బ్రెజిల్‌ వేదికగా 1950లో జరిగిన ప్రపంచకప్‌లో పాల్గొనాలని భారత్‌కు ఆహ్వానం లభించినా పలు కారణాలతో వెళ్లలేకపోయింది. 1950  నుంచి 1970 వరకు భారత ఫుట్‌బాల్‌ జట్టు ఓ వెలుగు వెలిగింది. 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌ లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టులో హైదరాబాద్‌ నుంచి ఏకంగా ఎనిమిది మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్‌కే చెందిన సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో రహీమ్‌ శిక్షణలో భారత జట్టు ఫైనల్లో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించింది.

1963లో కోచ్‌ రహీమ్‌ క్యాన్సర్‌తో మృతి చెందడంతో భారత ఫుట్‌బాల్‌ కూడా వెనుకడుగులు వేయడం ప్రారంభించింది. కాలానుగుణంగా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో వస్తున్న మార్పులకు తగ్గట్టు ఆలిండియా ఫుట్‌బాల్‌ సమాఖ్య అభివృద్ధి చర్యలు తీసుకోకపోవడంతో దేశంలో ఫుట్‌బాల్‌కు క్రమక్రమంగా ఆదరణ తగ్గిపోవడం    మొదలైంది. ఒకప్పుడు ఆసియాలో నంబర్‌వన్‌గా ఉన్న జట్టు నేడు దక్షిణాసియాలోని బంగ్లాదేశ్, నేపాల్‌ జట్లపై కూడా గెలవడానికి ఇబ్బంది పడుతోంది. 2022 ప్రపంచకప్‌ ఆసియా క్వాలిఫయింగ్‌ టోర్నీలో భారత్‌ గ్రూప్‌ దశలోనే వెను   దిరిగింది. 2026 ప్రపంచకప్‌ కోసం ఆసియా  నుంచి 8 లేదా 9 జట్లకు బెర్త్‌లు లభిస్తాయి.

ఈ నేపథ్యంలో భారత్‌ తమ ప్రపంచకప్‌ కలను సాకారం చేసుకోవాలంటే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత్‌ 106వ ర్యాంక్‌లో... ఆసియా లో 19వ స్థానంలో ఉంది. జపాన్, కొరియా, సౌదీ అరేబియా, ఇరాన్, ఆస్ట్రేలియా, ఖతర్, యూఏఈ, ఒమన్, ఉజ్బెకిస్తాన్, చైనా, బహ్రెయిన్, జోర్డాన్‌ లాంటి పటిష్ట జట్లను దాటుకొని భారత్‌ ప్రపంచకప్‌ బెర్త్‌ సాధించాలంటే అత్యద్భుతంగా ఆడాలి. భారత జట్టు మాజీ గోల్‌కీపర్‌ కల్యాణ్‌ చౌబే ఇటీవల అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మాజీ ఫుట్‌బాలర్‌ అధ్యక్షతలోనైనా భారత ఫుట్‌బాల్‌ అభివృద్ధివైపు అడుగులు వేస్తుందో లేదో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు