'రూ. 45 లక్షలిస్తే కేసు ఉపసంహరించుకుంటా'

25 Dec, 2020 11:04 IST|Sakshi

కరాచీ : నాలుగు వారాల క్రితం పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ తనను లైంగికంగా వేధించాడని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ హమీజా ముక్తర్‌ అనే మహిళ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె బాబర్‌ అజమ్‌పై సంచలను ఆరోపణలు చేసింది. ఇదే విషయమై ఆమె బాబర్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

తాజాగా బాబర్‌పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటే రూ.45 లక్షలు భరణంగా ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగింది. ఇదే విషయమై బాబర్‌ తనకు భరణం చెల్లించాలంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హమీజా పిటిషన్‌పై గురువారం సెషన్స్‌ కోర్టు విచారణ చేపట్టింది. బాబర్‌ తరపు లాయర్‌ మాట్లాడుతూ.. హమీజ్‌.. బాబర్‌పై అనవసర ఆరోపణలు చేస్తుంది.. కేవలం డబ్బు కోసమే ఈ నాటకమాడుతుందని, ఒక్కపైసా కూడా చెల్లించేది లేదని కోర్టుకు తెలిపారు. బాబర్‌ అజమ్‌ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడడంపై తమవద్ద ఆధారాలు ఉన్నాయని హమీజా తరపు లాయర్‌ కోర్టుకు స్పష్టం చేశాడు. ఇరువురి వాదనలు విన్న కోర్టు అన్ని అంశాలు పరిశీలిస్తామని తెలిపి కేసును వచ్చే వారానికి వాయిదా వేసింది. ('బాబర్‌ అజమ్‌ నన్ను నమ్మించి మోసం చేశాడు')

కాగా హమీజా గతంలో చేసిన వ్యాఖ్యలు పాక్‌ మీడియాలో సంచలనంగా మారాయి. 'బాబర్, నేను స్కూల్‌ దశ నుంచి మంచి స్నేహితులం. అతను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నాను. బాబర్‌కు ఆర్థికంగా కూడా సాయం చేశాను. కాగా 2010లో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి  బాబర్ నాకు ప్రపోజ్ చేశాడు. నేను దానికి అంగీకరించాను. ఆ తర్వాతి ఏడాదే తాము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. శారీరకంగా కూడా దగ్గరయ్యాం. జాతీయ జట్టుకు  ఎంపికైన తర్వాత బాబర్ తన మనసు మార్చుకున్నాడు. అప్పటినుంచి నన్ను కావాలనే దూరం పెడుతున్నాడు. ఇదే విషయమై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే చంపుతానని నాపై బెదిరింపులకు పాల్పడ్డాడు. బాబర్‌పై పీసీబీకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు' అని పేర్కొంది. 

బాబర్‌ అజబ్‌ ఇటీవలే పాకిస్తాన్‌ జట్టుకు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం పాక్‌ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. అయితే సిరీస్‌ ప్రారంభానికి ముందే వేలి గాయంతో బాబర్‌ అజబ్‌ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. తాజాగా డిసెంబర్‌ 26 నుంచి పాక్‌, న్యూజిలాండ్‌ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌ మొదలుకానుంది. అయితే బాబర్‌ గాయం తీవ్రత అలాగే ఉండడంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. బాబర్‌ స్థానంలో మహ్మద్‌ రిజ్వాన్‌ పాక్‌ జట్టకు నాయకత్వం వహించనున్నాడు. కాగా మూడు టీ20ల సిరీస్‌ను కివీస్‌ జట్టు 2-1 తేడాతో కైవసం చేసకుంది.

మరిన్ని వార్తలు