CWG 2022: కోవిడ్‌ అని తేలినా టీమిండియాతో ఫైనల్‌ మ్యాచ్‌ ఆడిన ఆసీస్‌ ఆల్‌రౌండర్‌

9 Aug, 2022 09:54 IST|Sakshi

22వ కామన్వెల్త్ క్రీడలు ముగిసాక మహిళల క్రికెట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ణారణ అయిన ఓ క్రికెటర్‌ బరిలోకి దిగడమే కాకుండా అందరితో కలియతిరిగుతూ సంబురాలు చేసుకుంది. భారత్‌తో ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు స్టార్‌ ఆల్‌రౌండర్‌ తహ్లియా మెక్‌గ్రాత్‌కు కోవిడ్‌ పాజిటివ్‌ అని తెలిసినా ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ అమెను తుది జట్టుకు ఎంపిక చేసి, బరిలోకి దించింది. 

ఈ మ్యాచ్‌లో మెక్‌గ్రాత్‌ బ్యాటింగ్‌లో 2 పరుగులు, బౌలింగ్‌లో 2 ఓవర్లలో 24 పరుగులిచ్చి ఏమంత ఆశాజనకమైన ప్రదర్శన చేయనప్పటికీ.. టీమిండియా స్వయంకృతాపరాధాల కారణంగా ఆస్ట్రేలియా 9 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. అయితే, తమ ప్లేయర్‌కు కోవిడ్‌ అని తెలిసినా ఆసీస్‌ యాజమాన్యం ఆమెను తుది జట్టుకు ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్త తెలిసి యావత్‌ క్రీడాలోకం షాక్‌కు గురైంది. 

ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఆసీస్‌ యాజమాన్యం వ్యవహరించిన తీరును అందరూ దుయ్యబడుతున్నారు. నిబంధనల ప్రకారం పాజిటివ్ వచ్చిన ప్లేయర్‌ని ఐసోలేషన్‌కి తరలించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కారణంగా టీమిండియా క్రికెటర్లు సబ్బినేని మేఘన, పూజా వస్త్రాకర్ (కోవిడ్‌ సోకడంతో) ఆసీస్‌తో తొలి మ్యాచ్‌ ఆడలేదు.

అయితే ఆస్ట్రేలియా మాత్రం ఫైనల్ మ్యాచ్‌లో మెక్‌గ్రాత్‌ని పక్కనబెట్టే సాహసం చేయడానికి ఇష్టపడలేదు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె 51 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 78 పరుగులు, అలాగే బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టి సూపర్‌ ఫామ్‌లో ఉం‍డటమే ఇందుకు కారణం. 

అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో మెక్‌గ్రాత్‌ రాణించింది (2 వికెట్లు, 23 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు). ఇదిలా ఉంటే, కరోనా వ్యాక్సిన్‌ వేసుకోని కారణంగా టెన్నిస్‌ స్టార్‌ జకోవిచ్‌ పట్ల ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలు ఉల్లంఘించాడని ఆస్ట్రేలియా ఓపెన్ కోసం ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన జకోను ఘోరంగా అవమానించి, కేసులు కూడా పెట్టారు.

చదవండి: ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. కోహ్లి వచ్చేశాడు


 

Poll
Loading...
మరిన్ని వార్తలు