మహిళల లీగ్‌కు మోగిన నగారా! 

4 Mar, 2023 01:12 IST|Sakshi

నేటి నుంచి డబ్ల్యూపీఎల్‌ 

మొదటి మ్యాచ్‌లో ముంబైతో గుజరాత్‌ జెయింట్స్‌ ‘ఢీ’ 

స్పోర్ట్స్‌ 18 చానెల్‌లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 

ముంబై: ఎన్నాళ్లుగానో వేచిన క్షణం రానే వచ్చింది... భారత మహిళల క్రికెట్‌లోనూ ఐపీఎల్‌ లాంటి టోర్నీ ఉండాలని, అమ్మాయిలకు మరిన్ని అవకాశాలు రావాలని ఏళ్లుగా సాగిన చర్చ ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. అసలు మహిళల లీగ్‌ ఉంటుందా, ఉండదా, వాణిజ్యపరంగా సఫలం అవుతుందా అనే సందేహాలు... నిర్వహణపై ఏనాడూ స్పష్టత లేని స్థితి... ఇప్పుడు ఇవన్నీ గతం... ఎట్టకేలకు బీసీసీఐ చొరవతో ఇప్పుడు అన్ని అడ్డంకులను దాటి... అదీ ఐపీఎల్‌ తరహా యాజమాన్యాల అండతో తొలి మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) సన్నద్ధమైంది. నేడు రాత్రి గం. 7:30 నుంచి జరిగే తొలి మ్యాచ్‌తో లీగ్‌కు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో డబ్ల్యూపీఎల్‌ విశేషాలు... 

బరిలో ఉన్న జట్లు (5)
కెప్టెన్‌లు: (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు–స్మృతి మంధాన; ముంబై  ఇండియన్స్‌–హర్మన్‌ప్రీత్‌ కౌర్‌; ఢిల్లీ క్యాపిటల్స్‌–మెగ్‌ లానింగ్‌; యూపీ వారియర్స్‌–అలీసా హీలీ; గుజరాత్‌ జెయింట్స్‌–బెత్‌ మూనీ). 
వేదికలు: 2 (ముంబైలోనే; బ్రబోర్న్‌ స్టేడియం,  డీవై పాటిల్‌ స్టేడియం) 
మొత్తం మ్యాచ్‌లు: 22 (20 లీగ్‌ మ్యాచ్‌లతో పాటు ఒక ఎలిమినేటర్, ఫైనల్‌) 
ఫార్మాట్‌: ప్రతీ టీమ్‌ ఇతర నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు (మొత్తం 8) ఆడుతుంది. టాప్‌గా  నిలిచిన టీమ్‌ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. తర్వాతి రెండు టీమ్‌ల మధ్య ‘ఎలిమినేటర్‌’ మ్యాచ్‌ విజేత రెండో ఫైనలిస్ట్‌ అవుతుంది.  
తుది జట్టులో విదేశీ ఆటగాళ్ల సంఖ్య: 4  
మ్యాచ్‌ సమయం: ఐపీఎల్‌లాగే ఒక మ్యాచ్‌ ఉంటే రాత్రి గం 7:30 నుంచి... రెండు మ్యాచ్‌లు ఉన్న రోజు తొలి మ్యాచ్‌ గం. 3:30 నుంచి... రెండో మ్యాచ్‌ రాత్రి గం. 7:30 నుంచి 
డీఆర్‌ఎస్‌: అందుబాటులో ఉంది. ఒక్కో ఇన్నింగ్స్‌లో జట్టుకు రెండు అవకాశాలు ఉంటాయి.   
లీగ్‌లో ఉన్న తెలుగు అమ్మాయిల సంఖ్య: 6 (స్నేహదీప్తి, అంజలి శర్వాణి, సబ్బినేని మేఘన, షబ్నమ్‌ (ఆంధ్రప్రదేశ్‌) అరుంధతి రెడ్డి, యషశ్రీ (హైదరాబాద్‌). 
 

మరిన్ని వార్తలు