Womens T20 Challenge: ట్రయల్‌ బ్లేజర్స్‌కు ఊరట విజయం.. ఫైనల్లో వెలాసిటీ, సూపర్‌నోవాస్‌

27 May, 2022 10:19 IST|Sakshi
సబ్బినేని మేఘన

ట్రయల్‌ బ్లేజర్స్‌కు ఊరట విజయం

పుణే: మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి సబ్బినేని మేఘన (47 బంతుల్లో 73; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో ట్రయల్‌బ్లేజర్స్‌ 16 పరుగుల తేడాతో వెలాసిటీపై గెలిచింది. అయితే రన్‌రేట్‌లో వెనుకబడిపోవడంతో బ్లేజర్స్‌ లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. శనివారం జరిగే ఫైనల్లో సూపర్‌నోవాస్‌తో వెలాసిటీ తలపడుతుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ట్రయల్‌ బ్లేజర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జెమీమా రోడ్రిగ్స్‌ (44 బంతుల్లో 66; 7 ఫోర్లు, 1 సిక్స్‌) దంచేసింది.  కెప్టెన్‌ స్మృతి మంధాన (1) నిరాశపరిచినా... వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి మేఘన మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. మేఘన 32 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్సర్లు), జెమీమా 36 బంతుల్లో (6 ఫోర్లు) అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించాక మేఘన అవుటైంది. తర్వాత హేలీ మాథ్యూస్‌ (16 బంతుల్లో 27; 4 ఫోర్లు) ధాటిగా ఆడింది. అనంతరం వెలాసిటీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులకే పరిమితమైంది. కిరణ్‌ నవ్‌గిరే (34 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగినా లాభం లేకపోయింది. 

మరిన్ని వార్తలు