World Boxing Championships 2023: ‘పంచ్‌’ సమరానికి వేళాయే..

15 Mar, 2023 07:51 IST|Sakshi

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ 

చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధం

నేడు ప్రారంభోత్సవం

రేపటి నుంచి బౌట్‌లు

స్వర్ణ పతక విజేతకు రూ. 82 లక్షలు ప్రైజ్‌మనీ 

న్యూఢిల్లీ: మూడోసారి ప్రపంచ మహిళల సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల నిర్వహణకు భారత్‌ సిద్ధమైంది. న్యూఢిల్లీలోని కేడీ జాదవ్‌ ఇండోర్‌ స్టేడియంలో ఈ మెగా ఈవెంట్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు సాయంత్రం జరిగే ప్రారంభోత్సవానికి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. గురువారం నుంచి బౌట్‌లు మొదలవుతాయి.

23న సెమీఫైనల్స్‌ జరుగుతాయి. 24న విశ్రాంతి దినం. 25, 26వ తేదీల్లో జరిగే ఫైనల్స్‌తో టోర్నీ ముగుస్తుంది. గతంలో 2006, 2018లలో భారత్‌ ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఆతిథ్యమిచి్చంది. మూడోసారీ న్యూఢిల్లీ వేదికగానే ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తుండటం విశేషం. మొత్తం 12 వెయిట్‌ కేటగిరీల్లో (48 కేజీలు, 50, 52, 54, 57, 60, 63, 66, 70, 75, 81, ప్లస్‌ 81 కేజీలు) బౌట్‌లు ఉంటాయి.

65 దేశాల నుంచి 300కుపైగా బాక్సర్లు పతకాల కోసం బరిలోకి దిగనున్నారు. పతక విజేతలకు భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. స్వర్ణ పతక విజేతకు లక్ష డాలర్లు (రూ. 82 లక్షలు)... రజత పతక విజేతకు 50 వేల డాలర్లు (రూ. 41 లక్షలు), కాంస్య పతక విజేతలకు (ఇద్దరికి) 25 వేల డాలర్ల (రూ. 20 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ అందజేస్తారు. గత ఏడాది టర్కీలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ఒక స్వర్ణం (నిఖత్‌ జరీన్‌), రెండు కాంస్య పతకాలు (మనీషా మౌన్, పర్వీన్‌ హుడా) సాధించింది.  

భారత బాక్సింగ్‌ జట్టు: నీతూ ఘణ్‌ఘాస్‌ (48 కేజీలు), నిఖత్‌ జరీన్‌ (50 కేజీలు), సాక్షి చౌదరీ (52 కేజీలు), ప్రీతి (54 కేజీలు), మనీషా మౌన్‌ (57 కేజీలు), జాస్మిన్‌ (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు), మంజు బంబోరియా (66 కేజీలు), సనామాచ చాను (70 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్‌ (75 కేజీలు), స్వీటీ బూరా (81 కేజీలు), నుపుర్‌ షెరాన్‌ (ప్లస్‌ 81 కేజీలు).  
 

మరిన్ని వార్తలు