ప్రపంచ అథ్లెటిక్స్‌ రిలే టోర్నీకి భారత మహిళల బృందం దూరం

28 Apr, 2021 09:55 IST|Sakshi

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత ఈవెంట్‌ అయిన ప్రపంచ అథ్లెటిక్స్‌ రిలే టోర్నమెంట్‌ నుంచి భారత మహిళల 4x400 మీటర్ల బృందం వైదొలిగింది. పోలాండ్‌లో మే 1, 2 తేదీల్లో ఈ టోర్నమెంట్‌ జరగనుంది. ఈ టోర్నీలో రాణించిన రిలే జట్లకు టోక్యో ఒలింపిక్స్‌కు, వచ్చే ఏడాది జరిగే ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధించే అవకాశముంది. ‘వరల్డ్‌ రిలే టోర్నీకి సిద్ధమవుతున్న భారత మహిళల 4x400 రిలే బృందానికి ఫిట్‌నెస్‌ సమస్యలు ఉన్నాయి.

ఈ నెలారంభంలో పూవమ్మ, సుభా, కిరణ్, అం జలి దేవి, రేవతి, విస్మయ, జిస్నా మాథ్యూలను రిలే జట్టులో ఎంపిక చేశాం. ఈ బృందం లోని నలుగురిలో ముగ్గురు అన్‌ఫిట్‌గా ఉన్నా రు. సబ్‌స్టిట్యూట్‌ కూడా లేకపోవడంతో భారత బృందం వైదొలగాలని నిర్ణయించుకుంది’ అని భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) వివరించింది. అయితే పురుషుల 4x400 మీటర్ల రిలే, మహిళల 4x400 మీటర్ల రిలే రేసుల్లో భారత్‌ బరిలోకి దిగుతుందని ఏఎఫ్‌ఐ తెలిపింది. జూన్‌లో క్వాలి ఫయింగ్‌ గడువు ముగిశాక టాప్‌–16లో ఉన్న రిలే జట్లు ఒలింపిక్స్‌ బెర్త్‌లు దక్కించుకుంటాయి. 

మరిన్ని వార్తలు