World TT Championship: శ్రీజ, శరత్‌ కమల్‌ పరాజయం

23 May, 2023 12:35 IST|Sakshi

డర్బన్‌: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ పోరాటం ముగిసింది. సింగిల్స్‌తోపాటు డబుల్స్‌ విభాగంలోనూ శ్రీజ ఇంటిదారి పట్టింది.

సోమవారం జరిగిన సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్రపంచ 112వ ర్యాంకర్‌ శ్రీజ 2–11, 4–11, 2–11, 4–11తో ప్రపంచ పదో ర్యాంకర్‌ యింగ్‌ హాన్‌ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. డబుల్స్‌ రెండో రౌండ్‌లో శ్రీజ–దియా చితాలె (భారత్‌) జోడీ 8–11, 8–11, 11–13తో సన్‌ యింగ్షా–వాంగ్‌ మాన్యు (చైనా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. 

పురుషుల సింగిల్స్‌లో భారత వెటరన్‌ స్టార్, 40 ఏళ్ల ఆచంట శరత్‌ కమల్‌ రెండో రౌండ్‌లో 4–11, 11–13, 8–11, 10–12తో లీ సాంగ్‌ సు (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌లో శరత్‌ కమల్‌–సత్యన్‌ (భారత్‌) జోడీ.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మనిక బత్రా–సత్యన్‌ (భారత్‌) జోడీ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాయి. 

అర్జున్‌ ఖాతాలో మూడో ‘డ్రా’ 
షార్జా మాస్టర్స్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. షాంట్‌ సర్గ్‌సియాన్‌ (అర్మేనియా)తో సోమవారం జరిగిన ఆరో రౌండ్‌ గేమ్‌ను అర్జున్‌ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.

ఈ టోర్నీలో రెండు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిన అర్జున్‌ 3.5 పాయింట్లతో 18వ ర్యాంక్‌లో ఉన్నాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, నిహాల్‌ సరీన్, ఆర్యన్‌ చోప్రా నాలుగు పాయింట్లతో ఉమ్మడిగా రెండో ర్యాంక్‌లో ఉన్నారు.    

మరిన్ని వార్తలు