World Under 17 Wrestling Championship: నిఖిల్‌కు ఆర్థిక సహాయం 

13 Aug, 2022 08:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ అండర్‌–17 రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఫ్రీస్టయిల్‌ 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన తెలంగాణ కుర్రాడు నిఖిల్‌ యాదవ్‌కు ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (నాచారం) యాజమాన్యం ఆర్థిక సహాయం చేసింది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ చైర్మన్‌ మల్కా కొమురయ్య నిఖిల్‌కు రూ. లక్ష నగదు పురస్కారాన్ని చెక్‌ రూపంలో అందజేశారు.

తండ్రి, మాజీ రెజ్లర్‌ సురేశ్‌ యాదవ్‌ అడుగుజాడల్లో నడుస్తున్న నిఖిల్‌ ప్రస్తుతం బళ్లారిలోని ఇన్‌స్పయిర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. 2011లో హంగేరిలో జరిగిన ప్రపంచ క్యాడెట్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో దేవీ సింగ్‌ ఠాకూర్‌ కాంస్య పతకం గెలిచిన తర్వాత... నిఖిల్‌ రూపంలో మరో హైదరాబాద్‌ రెజ్లర్‌ ప్రపంచ జూనియర్‌ టోర్నీలో పతకం సాధించాడు.

ఈ కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ప్రతినిధి మల్కా యశస్వి, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, నిఖిల్‌ తల్లి మమత, సోదరుడు అఖిల్, అంతర్జాతీయ మాజీ రెజ్లర్‌ అభిమన్యు, తెలంగాణ కేసరి రెజ్లర్‌ మెట్టు శివ పహిల్వాన్, కరాటే మాస్టర్‌ రవి తదితరులు పాల్గొన్నారు.   
చదవండి: FIFA World Cup 2022: ఒక రోజు ముందుగానే... కారణమిదే!

మరిన్ని వార్తలు