WPL 2023: విజృంభించిన ఢిల్లీ బౌలర్లు.. తక్కువ స్కోర్‌కే పరిమితమైన ముంబై ఇండియన్స్‌

20 Mar, 2023 21:17 IST|Sakshi

డబ్ల్యూపీఎల్‌-2023లో భాగంగా ఇవాళ (మార్చి 20) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హర్మన్‌ సేన, ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. మారిజన్‌ కాప్‌ (4-0-13-2), శిఖా పాండే (4-0-21-2), జెస్‌ జొనాస్సెన్‌ (4-0-25-2), అరుంధతి రెడ్డి (3-0-10-1) విజృంభించడంతో ముంబై బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

ఓ దశలో ముంబై టీమ్‌ కనీసం 100 పరుగులు చేయడం కూడా కష్టమే అనుకున్నా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు), పూజా వస్త్రాకర్‌ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్‌), ఇస్సీ వాంగ్‌ (24 బంతుల్లో 23, సిక్స్‌), అమన్‌జ్యోత్‌ కౌర్‌ (16 బంతుల్లో 19; 2 ఫోర్లు) పుణ్యమా 109 పరుగులు చేయగలిగింది. యస్తికా భాటియా (1), హేలీ మాథ్యూస్‌ (5), నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (0), అమేలియా కెర్‌ (8) విఫలమయ్యారు.

కాగా, ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండానే ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారైపోయాయి. పాయింట్ల పట్టికలో టాప్‌-3లో ఉన్న ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, యూపీ వారియర్జ్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ లీగ్‌ నుంచి నిష్క్రమించాయి. 

మరిన్ని వార్తలు