WPL 2023: సాధారణ స్కోరుకే పరిమితం.. ఢిల్లీ టార్గెట్‌ 148

16 Mar, 2023 21:02 IST|Sakshi

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఓపెనర్‌ లారా వోల్వార్డాట్‌ (45 బంతుల్లో 57, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌), అష్లే గార్డనర్‌(33 బంతుల్లో 51 పరుగులు, 9 ఫోర్లు), హర్లిన్‌ డియోల్‌ 31 పరుగులు రాణించడంతో గుజరాత్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

లారా, అష్లే గార్డనర్‌లు మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించి గుజరాత్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో జెస్‌ జొనాసెన్‌ రెండు వికెట్లు తీయగా.. అరుంధతి రెడ్డి, మారిజెన్నె కాప్‌ చెరొక వికెట్‌ తీశారు. 

టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన‌ గుజ‌రాత్ జెయింట్స్ మొద‌టి ఓవ‌ర్‌లోనే వికెట్ కోల్పోయింది. ఓపెన‌ర్ సోఫీ డంక్లీ (4) ఔట్ అయింది. మ‌రిజానే కాప్ వేసిన ఆఖ‌రి బంతికి లాంగాఫ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. కుదురుకున్న‌ హ‌ర్లీన్ డియోల్ (31) ను జొనాసెన్ రెండో వికెట్‌గా వెన‌క్కి పంపింది. దాంతో, గుజ‌రాత్ జ‌ట్టు 53 ర‌న్స్ వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ త‌ర్వాత‌.. ఓపెన‌ర్ లారా వోల్వార్డట్‌, అష్లే గార్డ్‌న‌ర్ గుజ‌రాత్‌ను ఆదుకున్నారు. తొలి మ్యాచ్‌లో విఫ‌ల‌మైన ఆమె కీల‌క మ్యాచ్‌లో రాణించింది. డ‌బ్ల్యూపీఎల్‌లో తొలి హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేసింది. 

మరిన్ని వార్తలు