WTC Final: ‘కోహ్లి క్రేజ్‌ అలాంటిది మరి.. జాన్‌ సీన మద్దతు భారత్‌కే’!

14 Jun, 2021 12:10 IST|Sakshi
జాన్‌ సీన షేర్‌ చేసిన కోహ్లి ఫొటో

సౌతాంప్టన్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఎప్పుడెప్పుడు ఆరంభమవుతుందా అని టీమిండియా అభిమానులు ఎదురుచూస్తున్నారు. జూన్‌ 18న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ గురించి ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటూ సందడి చేస్తున్నారు. అన్ని విధాలుగా పటిష్టంగా ఉన్న విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టే విజయకేతనం ఎగురవేస్తుందంటూ జోస్యం చెబుతున్నారు. రకరకాల మీమ్స్‌, ఫొటోలతో హల్‌చల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్‌ స్టార్‌ జాన్‌ సీన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఓ పోస్టు ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది. బ్యాట్‌ చేతబట్టి సీరియస్‌ లుక్‌తో ఉన్న కోహ్లి ఫొటోను పంచుకున్న జాన్‌ సీన.. క్యాప్షన్‌ మాత్రం జతచేయలేదు. 

ఇక ఈ పోస్టుకు స్పందనగా.. ‘‘ ‘‘కింగ్‌ కోహ్లి క్రేజ్‌ అలాంటిది మరి. తను ఎక్కడైనా ఉంటాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు జాన్‌ సీన టీమిండియాకు ఇలా మద్దతు తెలిపాడు’’ అంటూ భారత అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా  ఈ నెల 18 నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ల మధ్య డబ్యూటీసీ ఫైన‌ల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జూన్‌ 3న సౌతాంప్టన్‌కి చేరుకున్న టీమిండియా.. ప్రాక్టీస్ సెషన్స్‌లో బిజీగా గడుపుతోంది. ఆదివారం రెండు జట్లుగా విడిపోయిన భారత ఆటగాళ్లు ప్రాక్టీసు మ్యాచ్‌ ఆడారు. 

ఈ సందర్భంగా రిషబ్ పంత్ అద్భుత శతకంతో (94 బంతుల్లోనే 121 పరుగులు) అజేయంగా నిలువగా, ఓపెనర్ శుభమన్ గిల్ హాఫ్‌ సెంచరీతో (135 బంతుల్లో 85 పరుగులు) ఆకట్టుకున్నాడు. ఇక బౌలర్లలో ఇషాంత్ శర్మ(3/36) ఒక్కడే మెరుగ్గా రాణించాడు. కాగా కోహ్లి సేన వరుస విజయాలతో జోరు మీద ఉండటం.. మరోవైపు ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌ విజయంతో విలియమ్సన్‌ బృందం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగనుండటంతో డబ్ల్యూటీసీ పోరు మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

A post shared by John Cena (@johncena)

చదవండి: శతక్కొట్టిన పంత్‌.. ఫిఫ్టీతో ఆకట్టుకున్న గిల్‌

మరిన్ని వార్తలు