టీమిండియానే ప్రపంచ ఛాంపియన్‌.. ఆసీస్‌ కెప్టెన్‌ జోస్యం

15 Jun, 2021 20:16 IST|Sakshi

సిడ్నీ: మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమిండియానే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తుందని ఆసీస్‌ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ జోస్యం చెప్పాడు. తుది సమరంలో ప్రత్యర్ధి న్యూజిలాండ్‌ కూడా బలమైన జట్టే అయినప్పటికీ.. భారత్‌కే అవకాశలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ మెగా పోరులో టీమిండియా తమ సహజసిద్ధమైన క్రికెట్‌ ఆడినా న్యూజిలాండ్‌పై అలవోకగా నెగ్గగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా కూడా భారత్‌లాగే బలమైన బ్యాకప్‌ జట్టును కలిగి ఉండాలని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. కాగా, ఇటీవల కాలంలో టీమిండియాపై తరుచూ విమర్శలు చేస్తూ వస్తున్న పైన్‌, భారత్‌పై సానుకూలంగా స్పందించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కాగా, ఆసీస్‌ గతేడాది స్వదేశంలో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లతో చెరో టెస్ట్‌ సిరీస్‌ ఆడింది. వీటిలో కివీస్‌పై 3-0తేడాతో నెగ్గిన మాజీ ప్రపంచ ఛాంపియన్‌.. భారత్‌ చేతిలో మాత్రం 1-2తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న కివీస్‌పై విశ్లేషకులు భారీ అంచనాలు కలిగి ఉన్నారు. కివీస్‌ జట్టు అన్ని రంగాల్లో భారత్‌ కంటే పటిష్టంగా ఉందని, మరి ముఖ్యంగా ఇంగ్లండ్‌ వాతావరణ పరిస్థితులకు కివీస్‌ ఆటగాళ్లు బాగా అలవాటు పడ్డారని, ఇదే వారి విజయానికి దోహదపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 18న ఐసీసీ టాప్‌ టూ జట్ల మధ్య టైటిల్‌ పోరు జరుగనుంది.
చదవండి: కామన్‌వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌.. షెడ్యూల్‌ ప్రకటించిన నిర్వహకులు

మరిన్ని వార్తలు