కోహ్లీ, రవిశాస్త్రి ఆడియో లీక్.. 

3 Jun, 2021 21:38 IST|Sakshi

లండన్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో లీకైంది. న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్షిన్‌ ఫైనల్‌కు ముందు టీమిండియా అనుసరించాల్సిన వ్యూహాలపై కెప్టెన్‌, కోచ్‌ డిస్కస్‌ చేసిన అంశాలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. ఇంగ్లండ్‌కు బయల్దేరే ముందు ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోచ్ రవిశాస్త్రితో కలిసి కోహ్లీ మాట్లాడారు. అయితే, ఈ సమావేశానికి కొన్ని నిమిషాల ముందు రవిశాస్త్రితో కోహ్లీ మాట్లాడిన మాటలు లీకయ్యాయి. లైవ్ ఇంకా స్టార్ట్ కాలేదని భావించిన కోహ్లీ.. డబ్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్ లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌లను ఎలా ఔట్‌ చేయాలనే అనే అంశంపై రవిశాస్త్రితో చర్చించాడు. 

ఈ క్రమంలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లను రౌండ్ ద వికెట్ బౌలింగ్‌ చేయించడం ద్వారా కట్టడి చేయబోతున్నట్లు కోహ్లీ వెల్లడించాడు. అందుకు రవిశాస్త్రి కూడా అంగీకారం తెలిపాడు. అయితే, ఈ మాటలు డైరెక్ట్‌గా లైవ్‌లో వచ్చేయడంతో తమ ప్లాన్ బహిర్గతమైందని కోహ్లీ, రవిశాస్త్రి నాలుక కరుచుకున్నారు. కాగా, బుధవారం రాత్రి ముంబై నుంచి ఇంగ్లండ్‌కు బయల్దేరిన భారత జట్టు.. సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న న్యూజిలాండ్‌తో ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలపడనుంది. అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈ మేరకు 20 మందితో కూడిన భారత జంబో జట్టు, ముంబైలో 14 రోజుల క్వారంటైన్‌ను ముగించుకుని స్పెషల్ ఛార్టెర్ ప్లైట్‌‌‌లో లండన్‌కు బయల్దేరింది.
చదవండి: కచ్చితంగా ఐదు వికెట్లు తీస్తావని ధైర్యం నింపాడు..

మరిన్ని వార్తలు