WTC Final: ‘టీమిండియా ఓడిపోతుంది; నీ పని అయిపోయింది.. ఇక వెళ్లు’!

14 Jun, 2021 13:34 IST|Sakshi

సౌతాంప్టన్‌: టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్‌, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ మధ్య ట్విటర్‌ వార్‌ భలే సరదాగా ఉంటుంది. వీరిద్దరు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. క్రికెట్‌కు సం‍బంధించిన వివిధ అంశాలపై వివాదాస్సద వ్యాఖ్యలతో ముఖ్యంగా టీమిండియాను టార్గెట్‌ చేస్తూ.. వాన్‌ సోషల్‌ మీడియాను ఆకర్షిస్తే.. వాటికి దీటుగా తనదైన శైలిలో వ్యంగ్యాత్మక ధోరణిలో పంచ్‌లు వేస్తూ వసీం జాఫర్‌ ఫ్యాన్స్‌ మనసు చూరగొంటాడు. ఇక నాలుగు రోజుల్లో టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో మరోసారి వీరి కౌంటర్‌ అటాక్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ఇంగ్లండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కివీస్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రెండో టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో సిరీస్‌ నెగ్గి, 1999 తర్వాత మరోసారి ఈ ఘనత సాధించింది. అంతేకాకుండా ఇంగ్లండ్‌పై సిరీస్‌ విజయంతో ఐసీసీ టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విషయంపై స్పందించిన మైఖేల్‌ వాన్‌.. ‘‘న్యూజిలాండ్‌ హైక్లాస్‌ టీం.. పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని.. బ్యాట్‌తో.. బంతితో అదరగొడతారు... వాళ్లు కచ్చితంగా వచ్చే వారంలో టీమిండియాను ఓడిస్తారు’’అంటూ కివీస్‌ను ప్రశంసిస్తూనే భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. 

ఇక ఇందుకు స్పందించిన వసీం జాఫర్‌.. డబ్ల్యూటీసీ ఫైనల్.. ‘‘నీ పని అయిపోయింది.. ఇక వెళ్లు’’ అంటూ బాలీవుడ్‌ సినిమాకు సంబంధించిన మీమ్‌ షేర్‌ చేసి కౌంటర్‌ వేశాడు. ఈ క్రమంలో..‘‘ఇంగ్లండ్‌ ఓటమిని కూడా వాన్‌ ఇలా కవర్‌ చేసేశాడు.. కానీ మీరు సూపర్‌ జాఫర్‌ భాయ్‌ అదరగొట్టేశారు.. వాన్‌కు దిమ్మతిరిగే జవాబు ఇచ్చారంటూ భారత ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. ఇక జూన్‌ 18న ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ఇరుజట్లు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

చదవండి: WTC FInal: ‘కోహ్లి క్రేజ్‌ అలాంటిది మరి.. జాన్‌ సీన మద్దతు భారత్‌కే’!

మరిన్ని వార్తలు