టీమిండియాపై గెలుపు ఓ ప్రత్యేక అనుభూతి అంటున్న కివీస్‌ కెప్టెన్‌

24 Jun, 2021 19:20 IST|Sakshi

సౌథాంప్టన్‌:  ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో కోహ్లీ సేనపై గెలుపు ఓ ప్రత్యేక అనుభూతి అని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ పేర్కొన్నాడు. టీమిండియాపై గెలిచి ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌గా అవతరించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు స్పందించాడు. భారతీయులకు కోహ్లీ సేన తర్వాత తామంటేనే ఎక్కువ క్రేజ్‌ అని చెప్పుకొచ్చాడు. క్రికెట్‌ చరిత్రలో న్యూజిలాండ్‌ తొలిసారిగా ఓ ప్రపంచ టైటిల్‌ను గెలవడం చాలా ప్రత్యేకమని, ఈ గెలుపు కోసం 22 మంది ఆటగాళ్లు అన్ని విభాగాల్లో చాలా కష్ట పడ్డారని తెలిపాడు. "బిట్స్‌ అండ్‌ పీసస్‌" క్రికెటర్లుగా చెప్పుకునే తమ ఆటగాళ్లు ఈ గెలుపుకు నిజమైన అర్హులని అభిప్రాయపడ్డాడు.

ఈ సందర్భంగా ఆయన న్యూజిలాండ్‌ క్రికెటర్లకు వచ్చిన "నైస్‌ గైస్‌" అన్న బిరుదుపై కూడా స్పందించాడు. ఈ బిరుదును క్రికెట్‌ ప్రేమికులు మా ఆన్‌ ఫీల్డ్‌ ప్రవర్తనకు ఇచ్చిన కాంప్లిమెంట్‌గా భావిస్తామని తెలిపాడు. ఇన్నేళ్లేగా ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించకపోవడంపై మాట్లాడుతూ..   2015, 2019 ప్రపంచ కప్‌ ఫైనల్‌లలో తమ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందని, అయినప్పటికీ ఓటమిపాలవ్వడం చాలా బాధించిందని పేర్కొన్నాడు. అయితే టెస్ట్‌ ఫార్మాట్‌లో తాము ఛాంపియన్లమన్న అనుభూతి ఆ బాధలన్నింటినీ అధిగమించేలా చేసిందని అన్నాడు. ఈ గెలుపు తమకు శిఖర సమానమే అయినప్పటికీ.. ఇంతకంటే సాధించాల్సింది చాలా ఉందని వెల్లడించాడు. ఓవరాల్‌గా చక్కటి క్రీడా స్పూర్తి, పోటీతత్వంతో కూడిన క్రికెట్‌ ఆడామని చెప్పుకొచ్చాడు.
చదవండి: WTC Final: అందుకే పంత్‌ మైదానాన్ని వీడాడు..

మరిన్ని వార్తలు