WTC Final: మూడేళ్ల తర్వాత టీమిండియా చెత్త రికార్డు

23 Jun, 2021 21:16 IST|Sakshi

సౌతాంప్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ పైనల్లో టీమిండియా ఒక చెత్త రికార్డును నమోదు చేసింది. మూడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో టీమిండియా నుంచి ఒక్క ఆటగాడు కూడా అర్థసెంచరీ మార్క్‌ను చేరుకోలేకపోయాడు. పంత్‌ 41 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సరైన ప్రాక్టీస్‌ లేకుండానే బరిలోకి దిగిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్‌ బౌలర్ల దాటికి పరుగులు చేయడానికి నానా కష్టాలు పడింది. ఇంతకముందు 2018లో ఇంగ్లండ్‌ గడ్డపైనే లార్డ్స్‌ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో  ఒక ఇన్నింగ్స్‌లో టీమిండియా నుంచి ఒక్క అర్థ సెంచరీ నమోదు కాలేదు.  

ఇక టీమిండియా ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా టీమిండియా ఓవర్‌నైట్‌ స్కోరు 64/2 తో ఆరో రోజు ఆటను ప్రారంభించిన కాసేపటికే పుజారా, కోహ్లిల రూపంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అక్కడినుంచి ఏ దశలోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేయని టీమిండియా 170 పరుగులకే చాప చుట్టేసింది. పంత్‌ 41 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్‌ 30 పరుగులు చేశాడు. మొత్తంగా 138 పరుగుల లీడ్‌ సాధించిన టీమిండియా కివీస్‌ ముందు 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. కాగా కివీస్‌ ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవన్‌ కాన్వే(19), టామ్‌ లాథమ్‌(9) పరుగులు చేసి ఔటవ్వగా..  కేన్‌ విలియమ్సన్‌(8), రాస్‌ టేలర్‌(0) పరుగులతో క్రీజులో ఉన్నారు.

చదవండి: గ్రౌండ్‌లోనే టవల్‌ చుట్టుకున్న షమీ.. కారణం ఏంటంటే

WTC Final: కివీస్‌ ఈ పాటికే గెలవాల్సింది.. 

మరిన్ని వార్తలు