కోహ్లి నా దగ్గరికి వచ్చేవరకు ప్లాన్స్‌ చెప్పను: రహానే

10 Jun, 2021 12:52 IST|Sakshi

లండన్‌: టీమిండియా టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి కెప్టెన్‌గా ఉన్నప్పుడు తాను బ్యాక్‌సీట్‌లో ఉంటానని.. అతను నా దగ్గరికి వచ్చినప్పుడే నా ప్లాన్స్‌ రివీల్‌ చేస్తానని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న ఐసీసీ టెస్టుచాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు సన్నద్దమవుతున్న రహానే ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోకు ఇంటర్య్వూ ఇచ్చాడు.

''ఇప్పుడు టెస్టు జట్టుకు నేను వైస్‌ కెప్టెన్‌గా ఉన్నా.. కోహ్లి కెప్టెన్‌గా ఉన్నంతవరకు నాది బ్యాక్‌సీట్‌ రోల్‌. ఒక కెప్టెన్‌గా కోహ్లికి తన మైండ్‌లో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. వాటిని ముందు అమలు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఒక వైస్‌ కెప్టెన్‌గా నేను ప్లాన్స్‌ రెడీగా పెట్టుకుంటాను. అతని ప్లాన్స్‌ విఫలమై నా దగ్గరికి వచ్చినప్పుడు నా సలహాలు ఇస్తాను. ఇక బ్యాటింగ్‌ విషయానికి వచ్చేసరికి మేమిద్దరం మంచి సమన్వయంతో మెలుగుతాం. ఇప్పటికే ఇద్దరం ఎన్నోసార్లు భారీ భాగస్వామ్యాలు నిర్మించాం. మా ఇద్దరి ఆటలోనూ అటాకింగ్‌ గేమ్‌ ఎక్కువగా ఉంటుంది.. నాతో పోలిస్తే కోహ్లిలో ఎక్కువ కనిపిస్తుంది. పుజారాతో బ్యాటింగ్‌లో మంచి రిలేషన్‌ ఉన్నా.. అతనిది మూడో స్థానం.. నాది ఐదో స్థానం. కానీ కోహ్లి, నేను మాత్రం బ్యాటింగ్‌లో నాలుగు, ఐదో స్థానాల్లో రావడంతో మా ఇద్దరి కమ్యునికేషన్‌ కాస్త బలంగా ఉంటుంది.'' అని చెప్పుకొచ్చాడు.

ఇక రహానే గతేడాది ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రెండో టెస్టుకు కోహ్లి గైర్హాజరీలో జట్టుకు నాయకత్వం వహించాడు. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియాకు అద్భుత విజయం అందించాడు. అనంతరం అతని నాయకత్వంలోనే మూడో టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా చివరిదైన నాలుగో టెస్టును కోహ్లి నాయకత్వంలో గెలిచి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఇక ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జూన్‌ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా జరగనుంది. ఇప్పటికే క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న టీమిండియా ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. 
చదవండి: ఐసీసీ 'అల్టిమేట్ టెస్ట్ సిరీస్‌'గా భారత్‌, ఆస్ట్రేలియా సిరీస్‌

WTC Final : లెజెండ్‌తో నేను సిద్ధంగా ఉన్నా

మరిన్ని వార్తలు