గ్రౌండ్‌లోనే టవల్‌ చుట్టుకున్న షమీ.. కారణం ఏంటంటే

23 Jun, 2021 15:34 IST|Sakshi

సౌతాంప్టన్‌: టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చప్పగా సాగుతున్న సంగతి తెలిసిందే. వర్షం పదేపదే అంతరాయం కలిగించడం.. పూర్తి సెషన్లు ఆట కొనసాగకపోవడం.. ఇప్పటికే ఐదు రోజులు ముగిసిపోగా.. బుధవారం ఆటకు చివరి రోజు కావడంతో మ్యాచ్‌ డ్రా అవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ మంగళవారం మ్యాచ్‌ మధ్యలో తన చర్యలతో కాసేపు నవ్వులు పూయించాడు.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ సమయంలో.. తన బౌలింగ్ పూర్తయిన తర్వాత షమీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ కోసం వెళ్లాడు. డ్రింక్స్ తీసుకొచ్చిన రిజర్వ్ బెంచ్ ఆటగాడి నుంచి వాటర్ తీసుకొని తాగిన షమీ అనంతరం టవల్ తీసుకుని చెమట తుడుచుకున్నాడు. ఆ తర్వాత టవల్‌ను నడుముకి చుట్టుకున్నాడు. టవల్ చుట్టుకుని కాసేపు మహ్మద్ షమీ ఫీల్డింగ్ కూడా చేశాడు. ఆ సమయంలో ఇషాంత్ శర్మ బౌలింగ్ చేయగా.. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బంతుల్ని వరుసగా వదిలేస్తూ డిఫెన్స్‌ ఆడాడు. షమీ ఫీల్డింగ్ చేస్తున్న వైపు బంతి రాలేదు. ఒకవేళ షమీ ఉన్న వైపు బంతి వచ్చి ఉంటే ఎలా ఆపేవాడోనని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

షమీ టవల్‌ను అలా చుట్టుకోవడం వెనుక కారణం ఏంట తెలియదు కానీ.. బహుశా మ్యాచ్‌ కొనసాగుతున్న సమయంలో వర్షం పడితే అదే టవల్‌తో తుడుచుకోవడానికి అలా చేసి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా షమీ తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లు వేసి 76 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.  న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకి ఆలౌట్‌ కాగా.. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. మంగళవారం ఆట ముగిసే సమయానికి 64/2తో నిలిచింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ(8), చతేశ్వర్ పుజారా (12)ఉన్నారు. ఓపెనర్లు శుభమన్ గిల్ (8), రోహిత్ శర్మ (30)లను టిమ్ సౌథీ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేయగా.. భారత్ జట్టు ప్రస్తుతం 32 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

చదవండి: ఇదే గ్రౌండ్‌లో షమీ విశ్వరూపం, మళ్లీ రిపీటయ్యేనా?

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు