Ranji Trophy 2022 : హ్యాట్రిక్ సెంచరీలతో చెలరేగిన యశస్వి జైస్వాల్

17 Jun, 2022 16:43 IST|Sakshi

ముంబై యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ రంజీ ట్రోఫీ 2022లో అదరగొడతున్నాడు. ఉత్తర ప్రదేశ్‌తో సెమీఫైనల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ  జైస్వాల్ సెంచరీలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 100 పరుగులు చేసిన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో 181 పరుగులు సాధించాడు. ఇక అంతకుముందు ఉత్తరాఖండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా జైస్వాల్ సెంచరీతో మెరిశాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 393 పరుగులకి ఆలౌటైంది. జైస్వాల్(100)తో పాటు, సామ్స్ ములానీ 50 పరుగులతో రాణించాడు.

ఇక ఉత్తరప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 180 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్‌పాడే, మోహిత్ అవస్తీ, తనుష్ కోటియన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.  213 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ముంబై 127 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 420 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో జైస్వాల్(181), ఆర్మన్ జాఫర్(127) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 213 పరుగుల ఆధిక్యంతో కలిపి  ప్రస్తుతం 663 పరుగుల లీడ్‌లో ముంబై ఉంది.
చదవండి: ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లు.. టీమిండియాకు ఏమైంది..?

>
మరిన్ని వార్తలు