Yuvraj Singh: 'మ్యాచ్‌లో సిక్సర్లు లేవు.. పార్టీలో మాత్రం​ ఇరగదీశాడు'

13 Sep, 2022 14:11 IST|Sakshi

రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ కోసం టీమిండియా దిగ్గజాలంతా ఒకే చోట చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరల్డ్‌ సిరీస్‌లో మ్యాచ్‌లు ఆడుతూ బిజీగా ఉన్న ఈ క్రికెటర్లంతా మరోసారి డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోవడంపై అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ , ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా  సహా మరికొంత మంది రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఆడుతున్నారు.

కాగా సౌతాఫ్రికా లెజెండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా లెజెండ్స్‌ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పార్టీ మూడ్ లోకి వచ్చిన డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడు. మ్యాచ్‌లో సిక్సర్లు కొట్టడంలో విఫలమైన యువరాజ్‌ పార్టీలో మాత్రం తనదైన డ్యాన్స్‌తో హైలైట్‌గా మారాడు. పాత పాటలు వింటూ పలు డ్యాన్స్‌ మూమెంట్స్‌తో అలరించాడు.

కాగా యువీ డ్యాన్స్‌పై  ఇర్ఫాన్‌ పఠాన్‌ స్పందించాడు. ''యువరాజ్ సింగ్‌లో మాకు అత్యంత ఖరీదైన చీర్‌లీడర్ కనిపిస్తున్నాడు. నిజంగా ఇది అద్భుతమైన రాత్రి. సూపర్‌గా ఎంజాయ్‌ చేశాం. చాలాకాలం తర్వాత  ఒక సిరీస్‌ కోసం మేమంతా కలవడం సంతోషంగా అనిపిస్తోంది'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక శనివారం సౌతాఫ్రికా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్‌ విజయ భేరి మోగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా లెజెండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఇండియా బ్యాటర్లలో ఆల్‌రౌండర్‌ స్టువర్ట్‌ బిన్నీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 42 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లుతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అనంతరం 218 పరుగులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది.

చదవండి: Mohammed Siraj: తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు