కుల్దీప్‌ చెవులు పిండిన చహల్‌.. బెదిరించిన సిరాజ్‌

25 Jan, 2023 09:05 IST|Sakshi

ఇండోర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మ్యాచ్‌ విజయం అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతున్న సమయంలో చహల్‌, కుల్దీప్‌, సిరాజ్‌ల మధ్య ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

చహల్‌ వెనుక నుంచి కుల్దీప్‌ చెవులను పట్టుకొని పిండగా.. ముందున్న సిరాజ్‌ అతనికేదో వార్నింగ్‌ ఇచినట్లుగా కనిపించాడు. అయితే ఇదంతా కేవలం సరదా కోసమే అని వీడియోలో స్పష్టంగా కనిపించింది. కానీ వీడియోలో మాత్రం కుల్దీప్‌ కాస్త సీరియస్‌గానే కనిపించినప్పటికి.. సిరాజ్‌, చహల్‌లు మాత్రం నవ్వు మొహంతో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక వ్యక్తి తన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియాకు ఓపెనింగ్‌ జోడి రోహిత్‌, గిల్‌లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఇద్దరు శతకాలతో విరుచుకుపడడం.. చివర్లో పాండ్యా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు భారీ స్కోరు చేసింది.  అనంతరం బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 295 పరుగులకు ఆలౌట్‌ అయింది.

డెవన్‌ కాన్వే శతకంతో మెరిసినప్పటికి మిగతావారు విఫలమయ్యారు. శార్దూల్‌ ఠాకూర్‌ బ్యాటింగ్‌లో 25 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. శార్దూల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించగా.. టోర్నీలో డబుల్‌ సెంచరీ,సెంచరీతో మెరిసిన గిల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు దక్కింది.

చదవండి: వన్డే, టి20ల్లో మనమే.. ఇక టెస్టులే బాకీ

'ర్యాంకులు పట్టించుకోం.. ఆసీస్‌తో సిరీస్‌ అంత ఈజీ కాదు'

మరిన్ని వార్తలు