‘ఆనంద్‌ను మోసం చేసి గెలిచాను.. నన్ను క్షమించండి’

14 Jun, 2021 18:51 IST|Sakshi

ముంబై: ఆ ఆటగాడు చెస్‌లో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియ‌న్‌గా నిలిచాడు. చెస్‌ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. అలాంటి ఆటగాడిపై ఓ వ్యాపారవేత్త గెలచాడంటే నమ్మగలమా?  కానీ ఇది నిజమే. అయితే దానికి వెనుక దాగున్న అస‌లు నిజాలు బయటపడ్డాయి. ఆదివారం జరిగిన ఓ ఛారిటీ మ్యాచ్‌లో జెరోదా కంపెనీ కో ఫౌండ‌ర్‌ నిఖిల్ కామ‌త్‌ ఆడిన చెస్‌ గేమ్‌లో విశ్వనాథ్‌ ఆనంద్‌ను ఓడించాడు.

ఈ విజయం చాలా మందిని షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి. కాగా కోవిడ్ స‌హాయ నిధి కోసం విరాళాలు సేక‌రించ‌డానికి చెస్ కింగ్ విశ్వ‌నాథ‌న్ ఆనంద్‌, ప‌లువురు సెలబ్రిటీల‌తో చెస్ గేమ్స్ ఆడారు. అందులో ఆమిర్ ఖాన్‌, రితేష్ దేశ్‌ముఖ్‌లాంటి బాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా ఉన్నారు. తాజాగా నిఖిల్ కామ‌త్‌ తన విజయంపై స్పందిస్తూ.. ఈ విజయం వెనుక అసలు కారణాన్ని బట్ట బయలు చేశాడు. అతను తన ట్విటర్‌లో.. ‘ నేను విశ్వనాథ్ ఆనంద్‌ని కలుసుకోవాలని, మాట్లాడాలని కలలు కనేవాడిని. ఈ కలను సాకారం చేసినందుకు అక్షయ్‌పాత్రకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

అంద‌రూ నేను ఆనంద్‌పై విజయం సాధించానని అనుకుంటున్నారు. కానీ గేమ్‌ను చూస్తున్న నిపుణులు, కంప్యూట‌ర్ల సాయం ద్వారా ఈ ఆటను గెలిచాను. ఇలా చేసినందుకు నన్ను క్ష‌మించాలని’ ట్వీట్ చేశాడు. ఓ చారిటీ మ్యాచ్‌లో ఇలా మోసం చేసి గెల‌వ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, ఇలా జ‌రిగి ఉండాల్సింది కాద‌ని ఆలిండియా చెస్ ఫెడ‌రేష‌న్ సెక్ర‌ట‌రీ భ‌ర‌త్ చౌహాన్ అన్నారు. 

చదవండి:  గుర్రంతో పోటీపడి పరుగులు తీస్తున్న ధోని..

మరిన్ని వార్తలు