ZIM VS BAN 3rd T20: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన జింబాబ్వే.. నిర్ణయాత్మక మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ కైవసం

2 Aug, 2022 20:39 IST|Sakshi

ఫ్లవర్‌ బ్రదర్స్‌, అలిస్టర్‌ క్యాంప్‌బెల్‌, హీత్‌ స్ట్రీక్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్ల రిటైర్మెంట్‌ తర్వాత కళ తప్పిన జింబాబ్వే క్రికెట్‌ టీమ్‌ ఇటీవలి కాలంలో పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది. చాలాకాలం తర్వాత ప్రపంచకప్‌కు (టీ20) అర్హత సాధించిన ఆ జట్టు.. తాజాగా స్వదేశంలో తమకంటే మెరుగైన బంగ్లాదేశ్‌కు షాకిచ్చి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో చెరో మ్యాచ్‌ గెలిచి సమానంగా ఉండిన రెండు జట్లు మంగళవారం జరిగిన నిర్ణయాత్మక మూడు మ్యాచ్‌లో హోరాహోరీగా తలపడ్డాయి.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన జాంబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఆరంభంలో బంగ్లా బౌలర్లు రెచ్చిపోవడంతో ఓ దశలో 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆతిధ్య జట్టు.. ర్యాన్‌ బుర్ల్‌ (28 బంతుల్లో 54; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), జాంగ్వే (20 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ల సాయంతో ఓ మోస్తరు స్కోర్‌ చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్‌, హసన్‌ మహమూద్‌ చెరో 2 వికెట్లు, ముస్తాఫిజుర్‌, మెసద్దెక్‌ హొసేన్‌, నసుమ్‌ అహ్మద్‌, మహ్మదుల్లా తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం ఛేదనలో తడబడిన బంగ్లా జట్టు.. లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయి 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జింబాబ్వే బౌలర్లు విక్టర్‌ న్యాయుచి (3/29), బ్రాడ్‌ ఈవాన్స్‌ (2/26) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. అఫీఫ్‌ హొసేన్‌ (27 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు), మెహిది హసన్‌ (17 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్‌) జట్టును గెలిపించేందుకు సాయశక్తులా ప్రత్నించారు.

ఈ మ్యాచ్‌ మినహాయించి తొలి రెండు టీ20ల్లో మెరుపు అర్ధసెంచరీలు సాధించిన సికందర్‌ రాజా మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కించుకోగా.. ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీతో రాణించిన ర్యాన్‌ బుర్ల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆగస్ట్‌ 5 నుంచి ప్రారంభంకానుంది.  
చదవండి: 17 ఏళ్ల తర్వాత పాక్‌ పర్యటనకు ఇంగ్లండ్‌.. షెడ్యూల్‌ విడుదల..!

మరిన్ని వార్తలు