జింబాబ్వే పోరాటం

14 Mar, 2021 05:17 IST|Sakshi

రెండో ఇన్నింగ్స్‌లో 266/7

అబుదాబి: అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో జింబాబ్వే ఓటమి నుంచి తప్పించుకునేందుకు పోరాడుతోంది. ఫాలోఆన్‌ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 24/0తో ఆట కొనసాగించిన జింబాబ్వే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లకు 266 పరుగులు చేసింది. కెప్టెన్‌ సీన్‌ విలియమ్స్‌ (106 బ్యాటింగ్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించగా... తిరిపానో (63 బ్యాటింగ్‌; 11 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు 8వ వికెట్‌కు అజేయంగా 124 పరుగులు జోడించారు. రషీద్‌ ఖాన్‌ 5 వికెట్లు తీశాడు. ప్రస్తుతం జింబాబ్వే కేవలం 8 పరుగుల ఆధిక్యంలో ఉంది.   

అఫ్గానిస్తాన్‌కు పరుగు పెనాల్టీ
క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన అఫ్గాన్‌ జట్టుకు అంపైర్లు అనూ హ్య రీతిలో ఒక పరుగు పెనాల్టీగా విధించారు. మ్యాచ్‌ మూడో రోజు అఫ్గాన్‌ ఫీల్డర్‌ హష్మతుల్లా... ప్రత్యర్థి జట్టు టెయిలెండర్‌కు స్ట్రయికింగ్‌ రా వాలనే వ్యూహంతో బంతిని ఆపే సమయంలో ఉద్దేశపూర్వకంగా ఒక కాలును బౌండరీ అవతల పెట్టాడు. ఓవర్‌ చివరి బంతికి రజా షాట్‌ ఆడగా సింగిల్‌ మాత్రమే వచ్చే అవకాశం కనిపించింది. అయితే మళ్లీ రజాకు స్ట్రయికింగ్‌ రాకుండా పదో నంబర్‌ బ్యాట్స్‌మన్‌ ముజరబానికి బ్యాటింగ్‌ రావాలని హష్మతుల్లా ఆశించాడు. అయితే దీనిని గుర్తించిన అంపైర్లు అదనపు పరుగు ఇవ్వడంతో పాటు రజాకే బ్యాటింగ్‌ అవకాశం కల్పించారు.  

మరిన్ని వార్తలు