టి20 ప్రపంచకప్‌కు జింబాబ్వే, నెదర్లాండ్స్‌

16 Jul, 2022 03:50 IST|Sakshi

క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఫైనల్‌కు

దుబాయ్‌: ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే చివరి రెండు జట్లుగా జింబాబ్వే, నెదర్లాండ్స్‌ ఖరారయ్యాయి. క్వాలిఫయింగ్‌ టోర్నీ (బి)లో ఈ రెండు జట్లు ఫైనల్‌ చేరాయి. బులవాయోలో జరిగిన తొలి సెమీ ఫైనల్లో జింబాబ్వే 27 పరుగుల తేడాతో పపువా న్యూ గినియాపై విజయం సాధించింది. జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేయగా, న్యూ గినియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులే చేయగలిగింది.

మరో సెమీ ఫైనల్లో నెదర్లాండ్స్‌ 7 వికెట్ల తేడాతో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌)ను ఓడించింది. అమెరికా 19.4 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌట్‌ కాగా, నెదర్లాండ్స్‌ 19 ఓవర్లలో 3 వికెట్లకు 139 పరుగులు చేసింది. బాస్‌ డి లీడ్‌ (67 బంతుల్లో 91 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. టి20 ప్రపంచకప్‌లో ఆడబోవడం జింబాబ్వేకు ఇది ఆరో సారి కాగా, నెదర్లాండ్స్‌ ఐదో సారి బరిలోకి దిగనుంది. మొత్తం 16 జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి.

మరిన్ని వార్తలు