India vs Zimbabwe 2nd ODI: భారత్‌ జోరుకు తిరుగుందా!

20 Aug, 2022 04:23 IST|Sakshi

నేడు జింబాబ్వేతో రెండో వన్డే

గెలిస్తే టీమిండియా ఖాతాలో మరో సిరీస్‌

మ.గం.12.45 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

హరారే: జింబాబ్వే గడ్డపై అలవోక విజయంతో శుభారంభం చేసిన టీమిండియా ఇప్పుడు అదే జోరుతో సిరీస్‌పై కన్నేసింది. మరో మ్యాచ్‌ మిగిలుండగానే ఇక్కడే కప్‌ గెలవాలనే పట్టుదలతో రాహుల్‌ సేన బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్‌తో భారీ స్కోర్లను ఛేదించి మరీ గెలిచిన ఆతిథ్య జింబాబ్వే జట్టు... వారాల వ్యవధిలోనే భారత్‌ ఆల్‌రౌండ్‌ దెబ్బకు విలవిల్లాడింది. ఇప్పుడు సిరీస్‌లో నిలిచేందుకో, ఈ మ్యాచ్‌ గెలిచేందుకో కాదు... భారత్‌ ధాటిని ఎదుర్కోవాలని లక్ష్యంతోనే జింబా బ్వే రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. టీమిండియా సీమర్లను ఆరంభ ఓవర్లలో ఎదుర్కొంటే... గెలుపు, భా రీస్కోరు సంగతి అటుంచి కనీసం 50 ఓవర్ల కోటా అయినా ఆడుకోవచ్చని జింబాబ్వే ఆశిస్తోంది.  

ఆకాశమే హద్దుగా భారత్‌
భారత్‌ జోరుకు ఆకాశమే హద్దు! ముఖ్యంగా ఓపెనింగ్‌ జోడి. ధావన్‌–శుబ్‌మన్‌ గిల్‌ కొన్నాళ్లుగా తమకెదురైన ప్రతీ ప్రత్యర్థిని, ప్రతీ బౌలర్‌ను అలవోకగా ఎదుర్కొంటున్నారు. సులువుగా పరుగులు, భారీ భాగస్వామ్యాలు నమోదు చేస్తున్నారు. మిడిలార్డర్‌లో రాహుల్‌ తన పునరాగమనాన్ని చాటాలని ఉవ్విళ్లూరుతుండగా, సంజు సామ్సన్, దీపక్‌ హుడా సీనియర్ల గైర్హాజరీలో సత్తా చాటుకుంటున్నారు. బౌలింగ్‌ విభాగం కూడా ఆతిథ్య జట్టు కంటే పటిష్టంగా ఉంది. బరిలోకి దిగి చాన్నాళ్లయినా... దీపక్‌ చహర్‌ తొలి ఓవర్‌నుంచే లయ అందుకున్నాడు. గత మ్యాచ్‌లో అతను టాపార్డర్‌ను కూల్చిన తీరు అద్భుతం. స్పిన్నర్‌ అక్షర్, సీమర్‌ ప్రసిధ్‌ కూడా వైవిధ్యమైన బంతులతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నారు.

ఒత్తిడిలో జింబాబ్వే
పటిష్టమైన ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు జింబాబ్వే ఆపసోపాలు పడుతోంది. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో తేలిపోతోంది. తొలి వన్డే ఫలితాన్ని పరిశీలిస్తే ఆతిథ్య జట్టు సిరీస్‌ను ఆఖరి దాకా తీసుకొ చ్చే అవకాశమైతే లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎటొచ్చీ ఓటమి అంతరాన్ని తగ్గించడం, లేదంటే పరువు నిలుపుకొనే పోరాటంపైనే జింబాబ్వే దృష్టి పెట్టింది. ఇన్నోసెంట్‌ కైయా, మరుమని, వెస్లీ బాధ్యత కనబరిస్తే మంచి స్కోరు చేయవచ్చు.

పిచ్‌–వాతావరణం
తొలి వన్డే ఆడిన పిచే! మ్యాచ్‌ ఆరంభంలో కొత్తబంతి సీమర్లు చెలరేగొచ్చు. తర్వాత బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఆటకు అనుకూల వాతవరణం ఉంది. వాన ముప్పే లేదు.

జట్లు (అంచనా)
భారత్‌: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), ధావన్, గిల్, ఇషాన్‌ కిషన్, దీపక్‌ హుడా, సంజూ సామ్సన్, అక్షర్‌ పటేల్, దీపక్‌ చహర్, కుల్దీప్, ప్రసిధ్‌ కృష్ణ, సిరాజ్‌.
జింబాబ్వే: రెగిస్‌ చకాబ్వా (కెప్టెన్‌), కైయా, మరుమని, సియాన్‌ విలియమ్స్, వెస్లీ మధెవెర్, సికందర్‌ రజా, రియాన్‌ బర్ల్, ల్యూక్‌ జాంగ్వే, ఇవాన్స్, విక్టర్, రిచర్డ్‌.  

మరిన్ని వార్తలు