నెల్లూరు(క్రైమ్): భూ ఆక్రమణలకు యత్నిస్తున్న వారిపై నెల్లూరు రూరల్ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. అంబాపురంలోని 10.38 ఎకరాల ప్రభుత్వ భూమి విషయమై కొన్నేళ్లుగా హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. ఈ నెల ఒకటిన అంబాపురం ఎస్సీకాలనీకి చెందిన వివిధ కుటుంబాలు గుడిసెలు వేసేందుకు యత్నించగా పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా 145 సీఆర్పీసీ ఉత్తర్వులను తహసీల్దార్ సుబ్బయ్య జారీ చేశారు. అయినా ఈ నెల 17న ఎమ్మార్పీఎస్ నేతలు సుబ్బయ్య, శ్రీను, వెంకట్రాయుడు, వెంకటరమణయ్య, స్థానిక ఎస్సీకాలనీకి చెందిన మురళి, చిరంజీవి సహకారంతో 96 మంది అక్రమంగా ప్రవేశించి నిర్మాణాలు చేసేందుకు యత్నించారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. దీంతో వీరిపై కేసులు నమోదు చేశారు.