నెల్లూరు అల్లుడ్ని కావడం గర్వంగా ఉంది

1 May, 2023 09:19 IST|Sakshi
కళాంజలి పురస్కారం అందుకుంటున్న శుభలేఖ సుధాకర్‌

నెల్లూరు(బృందావనం): ఎందరో కళాకారులను అందించిన నెల్లూరుకు అల్లుడిని కావడం గర్వకారణంగా ఉందని ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్‌ అన్నారు. కళాంజలి 35వ వార్షికోత్సవం సందర్భంగా నెల్లూరు పురమందిరంలో ఆదివారం రాత్రి కళాంజలి పురస్కారాన్ని సుధాకర్‌కు రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ సంగీతానికి మంత్రముగ్ధులను చేసే శక్తి ఉందన్నారు. తనకు పాటలు పాడడం ఇష్టమని అయితే.. ప్రముఖ సింగర్‌ తన భార్య ఎస్పీ శైలజ దయచేసి మీరు పాటలు పాడవద్దని వారి మధ్య జరిగిన సంభాషణను చమత్కరంగా వివరించారు. మారుతున్న కాలంతోపాటు 35 సంవత్సరాలుగా కళాంజలి సంస్థ చేస్తున్న సేవలను అభినందించారు.

అలాగే పాడుతా తీయగా ఫైనలిస్ట్‌ శరత్‌చంద్రకు కళాంజలి అవార్డును అందజేశారు. కార్యక్రమంలో లాయర్‌ వారపత్రిక సంపాదకుడు తుంగాశివప్రభాత్‌రెడ్డి, కాసా పెంచల వరప్రసాద్‌ నాయుడు, బయ్యా వెంకటరవికుమార్‌, వీరిశెట్టి హజరత్‌బాబు, వాకాటి విజయకుమార్‌రెడ్డి, ఎన్‌.బలరామయ్యనాయుడు, ఎన్వీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా డి.అరుణ్‌కుమార్‌ వ్యవహరించారు. బిల్లీశ్యాంసన్‌ ఆధ్వర్యంలో గాయకబృందం పాడిన పాటలు అలరించాయి. కార్యక్రమాన్ని కళాంజలి వ్యవస్థాపకుడు అనంత్‌, ఆర్గనైజర్‌ దువ్వూరు బెనర్జీ, సభ్యులు జి.శివకుమార్‌రెడ్డి పర్యవేక్షించారు.

మరిన్ని వార్తలు