● ఇన్చార్జ్ డీఈఓ మీనాక్షి
కనగానపల్లి: పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు సక్రమంగా ఏర్పాటు చేయాలని జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖాధికారి మీనాక్షి ఆదేశించారు. కనగానపల్లిలో పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసిన స్థానిక జిల్లా పరిషత్, మోడల్ స్కూల్ను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎటువంటి లోటుపాట్లకు తావివ్వరాదన్నారు. డెస్కులు, విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతి సక్రమంగా ఏర్పాటు చేయించాలని ఎంఈఓ అరుణమ్మను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మిదేవి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రవికిరణ్, పలువురు ఉపాద్యాయులు పాల్గొన్నారు.
ఆటోను ఢీకొన్న ట్రావెలర్.. యువకుడి మృతి
పెనుకొండ: పట్టణ సమీపంలోని పులేకమ్మ ఆలయం ఎత్తు వద్ద 44వ జాతీయ రహదారిపై ట్రావెలర్ వాహనం ఢీకొని ధర్మవరం ప్రాంతానికి చెందిన పురుషోత్తం (24) అనే యువకుడు మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పురుషోత్తం ఆటోలో బియ్యం వేసుకుని సోమందేపల్లి వైపు వస్తుండగా వెనుక నుంచి టెంపో ట్రావెలర్ ఢీకొంది. దీంతో ఆటో ముందున్న మోరీని ఢీకొని రోడ్డు పక్కన పడిపోయింది. తీవ్రంగా గాయపడిన పురుషోత్తం అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తీసుకొచ్చిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.