ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోండి

29 Mar, 2023 00:48 IST|Sakshi
ఎనుములపల్లి ప్రత్యేక శిబిరంలో ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకుంటున్న దృశ్యం

పుట్టపర్తి అర్బన్‌: కేంద్రం ఆధార్‌ వివరాల అప్‌డేషన్‌ను తప్పనిసరి చేసింది. లేకపోతే ఆధార్‌ కార్డులు సస్పెన్షన్‌లో పడతాయని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పౌరులంతా ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేసుకునేందుకు సచివాలయాల్లో ‘ఆధార్‌’ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసింది.

ఆధార్‌ లేకపోతే అంతే...

ఆధార్‌కార్డు ప్రతి ఒక్కరికీ అత్యంత ప్రధానమైనది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలన్నా, బ్యాంకుల్లో వ్యక్తిగత ఖాతాలు తెరవాలన్నా, విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టు పొందాలన్నా, ప్రతి చోటా ఆధార్‌ అవసరం ఉంటుంది. బ్యాంకు ఖాతాలు, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు, ఓటరు కార్డు, పాన్‌ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కేంద్రం ఆదేశిస్తోంది. అయితే ఆధార్‌ వచ్చిన కొత్తలో ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకోకుండానే ఆధార్‌ కార్డులు జారీ చేశారు. అందువల్ల ప్రస్తుతం డాక్యుమెంట్లను ఇచ్చి ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు

ఆధార్‌లో వివరాల అప్‌డేట్‌ చేసుకునేందుకు ప్రభుత్వం జిల్లాలోని 75 సచివాలయాల్లో ఆధార్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో నామమాత్రపు ఫీజుతో ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేసుకోవచ్చు. జిల్లాలో 13,02,526 మంది ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉండగా, ప్రస్తుతం 2,21,623 మంది వివలరాలు అప్‌డేట్‌ చేసుకున్నారు. ఇంకా 10,80,903 మంది ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోలేదని, వారంతా త్వరపడాలని అధికారులు సూచిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఆధార్‌ అప్‌డేట్‌కు గడవు ముగియనుండడంతో ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు ప్రజల్లో అవగాహన కల్పించి అప్‌డేట్‌ ఆధార్‌ చేసుకునేలా చూడాలని డీఆర్‌ఓ కొండయ్య ఆదేశించారు.

అప్‌డేట్‌ ఎందుకంటే

2010 నుంచి 2015 వరకూ ఆధార్‌ కార్డులు మంజూరుకు ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకోలేదు. దీంతో బోగస్‌ కార్డులు పెరిగిపోయాయి. అందువల్ల ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాల్సి వస్తోంది.

● 2016 తర్వాత ఆధార్‌లో ఫొటో, జన్మదినం తేదీ, చిరునామా మార్చుకోని వారు డాక్యుమెంట్లు అప్‌డేట్‌ చేసుకోవాలి.

● ముఖ్యంగా శ్రీసత్యసాయి జిల్లా వాసులకు గతంలో అనంతపురం జిల్లా అని ఉంటుంది. అందువల్ల పేరు, చిరునామాతో పాటు తప్పనిసరిగా జిల్లా పేరు మార్చుకోవాల్సి ఉంటుంది.

● ఆధార్‌ కార్డు సస్పెన్షన్‌ అయితే కార్డులో లింకు అయిన బ్యాంకింగ్‌, పోస్టల్‌, గ్యాస్‌, సేవలు నిలచిపోయే ప్రమాదం ఉంటుంది. ఆధార్‌లో ఏ చిన్న తప్పు ఉన్నా... భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు వస్తాయి. వివాహానికి ముందు, తరువాత మహిళలు ఆధార్‌ అప్‌డేట చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మంజూరు చేసిన సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది.

జిల్లా వ్యాప్తంగా 75 కేంద్రాల ఏర్పాటు

వివరాలు ధ్రువీకరించుకోకపోతే

‘ఆధార్‌’ సస్పెన్షన్‌

మరిన్ని వార్తలు