మడకశిర(అగళి): ఉపాధి పనుల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని డ్వామా పీడీ రామాంజినేయులు హెచ్చరించారు. అగళిలో బుధవారం ఉపాధి పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో జరిగిన రూ.7.31కోట్ల పనులకు సంబంధించిన పనులపై చర్చించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఉపాధి సిబ్బంది పనుల్లో పారదర్శకత పాటించాలని కోరారు. విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. కాగా, ఉపాధి పనుల తీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. కూలీల మస్టర్లు తప్పులతడకగా ఉన్నాయన్నారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో జరిగిన పనుల్లో రూ.15,98,398 మేర గోల్మాల్ అయినట్లు గుర్తించిన అధికారులు నిధులను రికవరీ చేయాలని ఆదేశించారు. ఉపాధి పథకంలో జరిగిన పనుల్లో కేవలం రూ.9,185 రికవరీకి నిర్ణయించారు. రూ.33 వేలు పెనాల్టీ విధించారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగినా అధికారులు నామమాత్రంగా రికవరీ చేయడం పట్ల ప్రజా ప్రతినిధులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో డీవీఓ రమణారెడ్డి, ఏపీడీ జయసింహ, కోర్స్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ నరేంద్రకుమార్, ఏపీఓశివన్న, ఉపాధి సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
డ్వామా పీడీ రామాంజినేయులు