హిందూపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ క్రాప్ నమోదులో జరిగిన గోల్మాల్పై అధికారులు విచారణ ప్రారంభించారు. 2021 క్రాప్ ఇన్సూరెన్స్ కింద ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి 2022 జూన్లో 4 లక్షల మంది రైతులకు రూ.855.55 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. శ్రీసత్యసాయి జిల్లాలో చిలమత్తూరు, పరిగి, బుక్కపట్నం, నల్లమాడ, పుట్టపర్తి, కొత్తచెరువు, అగళి, గుడిబండ, కనగానపల్లి, రొద్దం మండలాల్లో పంటలు సాగు చేయకుండానే సుమారు 45 మంది పరిహారం పొందారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సర్కారు విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో బుధవారం రైతు పొలాల వద్దకు ఇతర వ్యవసాయ డివిజన్ అధికారులను పంపి విచారణ చేయించింది. చిలమత్తూరు మండలం శెట్టిపల్లిలో మొక్కజొన్న సాగు చేయకుండనే 1.80 ఎకరాల్లో రూ.22,084, సాగు చేసిన పంట కన్నా 6 ఎకరాలు అధికంగా నమోదు చేసి, రూ.1.62 లక్షల వరకు లబ్ధి పొందారు. దీనిపై పెనుకొండ ఏడీఏ స్వయంప్రభ ఆధ్వర్యంలో విచారణ జరిపిన అధికారులు మూడు పేర్లతో దాదాపు రూ.2 లక్షలకు పైగా అక్రమంగా లబ్ధి పొందినట్లు గుర్తించారు.