దుకాణంలో విద్యుత్‌ మోటార్ల చోరీ

30 Mar, 2023 00:44 IST|Sakshi
చోరీకి గురైన షాపు

రొళ్ల: దుకాణంలోని విద్యుత్‌ మోటార్లు చోరీకి గురైన ఘటన మండలకేంద్రంలో బుధవారం వెలుగుచూసింది. ఎస్‌ఐ వెంకటరమణ తెలిపిన మేరకు.. స్థానిక మడకశిర ప్రధాన రోడ్డు పక్కన వాసవీ మాత దేవాలయం సమీపంలో మెకానిక్‌ క్రిష్ణప్ప ఎలక్ట్రికల్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. విద్యుత్‌ మోటార్ల రీవైండింగ్‌ పనులు ముగించుకుని మంగళవారం సాయంత్రం ఇంటికి వెళ్లారు. బుధవారం దుకాణానికి రాగా షట్టర్‌ తొలగించిన స్థితిలో కనిపించింది. రైతులు రీవైండింగ్‌ కోసం తెచ్చి ఉంచిన 10 విద్యుత్‌ మోటార్లతో పాటు రీవైండింగ్‌ చేయడం కోసం తెచ్చిన 30 కిలోల కొత్త వైర్‌ కూడా కనపడలేదు. సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీకి గురైన వస్తువుల విలువ రూ.3 లక్షలుగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. దుకాణానికి సమీపాన సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ కారులో దుండగులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో వచ్చి మోటార్లు దొంగిలించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు