-

నవశకానికి నాలుగేళ్లు

30 May, 2023 09:04 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. పోయాయి. ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు.. వెళ్లారు. కానీ గత చరిత్రలను తిరగరాసి, గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని ఏర్పాటు చేసి కొత్త చరిత్రకు నాందిపలికింది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అమలుచేయని విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సేవల్లో కొత్త ఒరవడి నాంది పలికింది. సంక్షేమం అంటే ప్రజలు..ప్రజలంటేనే సంక్షేమం అన్న పదానికి నిర్వచనం చెప్పింది. రేషన్‌ కార్డు మొదలుకొని సామాజిక పెన్షన్‌ల వరకూ కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులకు అందజేస్తూ అందరి ప్రభుత్వంగా పేరుగాంచింది...ఇలా వైఎస్సార్‌ సీపీ నాలుగేళ్ల పాలనలో లెక్కలేనన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేదల ముఖాల్లో చిరునవ్వు చిందేలా చూస్తోంది.

చదువులకు పెద్దపీట
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది స్కూళ్లలో నాడు నేడు పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ బడులు ప్రైవేటు స్కూళ్లను తలపిస్తున్నాయి. అడ్మిషన్ల సంఖ్య భారీగా పెరిగింది. డ్రాపౌట్లు తగ్గుముఖం పట్టాయి. ప్రతి తల్లీ తన బిడ్డను బడికి పంపితే అమ్మఒడి కింద రూ.15 వేలు ఇస్తున్నారు. స్కూళ్లలో మరుగుదొడ్ల నుంచి మంచినీళ్ల కుళాయిల వరకూ అన్నీ ఏర్పాటు చేశారు. ఇదొక్కటే కాదు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెనకు నేరుగా సొమ్ములిస్తున్నారు. విదేశీ విద్యాదీవెన ద్వారా ఒక్కో విద్యార్థిపై గరిష్టంగా రూ.కోటి ఖర్చు చేసే జగనన్న విదేశీ విద్యాదీవెన అందుబాటులోకి తెచ్చి పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందుబాటులోకి తెచ్చారు.

చుక్కల భూములకు విముక్తి
గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా వైఎస్సార్‌ సీపీ సర్కారు వందేళ్ల క్రితం ఉన్న రికార్డులను సవరించి రీసర్వే చేపట్టింది. వివాదాల్లేని భూముల చిట్టాను తయారు చేస్తోంది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో 43 గ్రామాల్లో సర్వే పూర్తయింది. అలాగే 22–ఏలో ఉన్న భూములపై సాగుదారులకు హక్కులుండేవికావు. జగన్‌ సర్కారు అలాంటి భూములన్నిటికీ విముక్తి కల్పించి రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించింది.

మెడికల్‌ కాలేజీలకు మహర్దశ
అనంతపురం మెడికల్‌ కాలేజీకి మహర్దశ వచ్చింది. రాష్ట్రంలో జగన్‌ సర్కార్‌ కొలువుదీరినప్పటి నుంచి ఇప్పటివరకూ అనంత మెడికల్‌ కళాశాలకు ఏకంగా 70 పీజీ సీట్లు అదనంగా వచ్చాయి. మరో రూ.450 కోట్లతో అదనపు కాలేజీకి కొత్త భవనాలకు పనులు ప్రారంభమయ్యాయి. ఇక శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వద్ద మెడికల్‌ కాలేజీ ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 2026 నాటికి ఈ కాలేజీ అందుబాటులోకి రానుంది.

ఫ్యామిలీ ఫిజీషియన్‌తో కొత్త చరిత్ర
ఫ్యామిలీ ఫిజీషియన్‌ వ్యవస్థ దేశంలోనే కొత్త చరిత్ర సృష్టించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజల వద్దకే వైద్యం వెళ్లింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఫ్యామిలీ ఫిజీషియన్‌తో కొత్త భరోసా వచ్చింది. ఫ్యామిలీ ఫిజీషియన్‌ డాక్టర్‌ విధానంలో డయాబెటిక్‌, హైపర్‌ టెన్షన్‌తో పాటు పలు అసాంక్రమిక వ్యాధులను గుర్తించి వైద్యం చేస్తున్నారు.

ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులు
ఒకప్పుడు పీహెచ్‌సీకి వెళితే వైద్యులే కనిపించేవారు కాదు. నాలుగేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి ఇద్దరు వైద్యులను నియమించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితిలోనైనా అక్కడే వైద్యం అందించేలా ఏర్పాటు చేశారు. దీంతో పాటు వైఎస్సార్‌ హెల్త్‌క్లినిక్‌లు ఏర్పాటు చేసి మిడ్‌లెవెల్‌ హెల్త్‌ప్రొవైడర్‌ను నియమించారు. దీంతో తమ సొంత గ్రామంలోనే వైద్యం అందే పరిస్థితులు కల్పించారు.

నాలుగేళ్లలో లక్ష మందికి పైగా..
వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన 108 అంబులెన్సు వ్యవస్థ 2019 నాటికి పూర్తిగా నిర్వీర్యమైంది. దీంతో బాధితులు బిక్కు బిక్కుమనే పరిస్థితి. దీంతో అధికారంలోకి వచ్చీరాగానే జగన్‌ సర్కారు 108 వ్యవస్థపై దృష్టి సారించింది. మండలానికొక 108 అంబులెన్సును ఏర్పాటు చేసింది. దీంతో ఏ రాష్ట్రంలో లేని విధంగా సర్వీసులు మెరుగు పడ్డాయి. దీనికి తోడు మండలానికొక 104 వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఇంటివద్దకే వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నాయి. కరోనా సమయంలో 108 అంబులెన్సులే పెద్దదిక్కుగా ఉన్నాయి.

రైతుకు భరోసా
రైతే రాజు అని అని నమ్మిన ప్రభుత్వమిది. వైఎస్సార్‌ రైతు భరోసా పేరిట (పీఎం కిసాన్‌) పేరుతో 5.76 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.728 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.3 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ అయ్యింది. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద గత ఏడాది రికార్డు స్థాయిలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు రూ.855 కోట్లు మంజూరైంది. మూడేళ్లలో రూ.1,200 కోట్లకుపైగా అందింది. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద రూ.120 కోట్ల మేర రైతులకు అందింది. అలాగే ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.250 కోట్లు, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు రూ.14 కోట్లు అందజేసింది. డ్రిప్‌, స్ప్రింక్లర్లు కింద రూ.350 కోట్లు వ్యయం చేసింది. విత్తనం వేరుశనగ, పప్పుశనగ సబ్సిడీ కింద జగన్‌ సర్కార్‌ నాలుగేళ్లలలో ఏకంగా రూ.500 కోట్లు వ్యయం చేసింది.

పారిశ్రామికాభివృద్ధి పరుగులు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పారిశ్రామిక వృద్ధి పరుగులు పెడుతోంది. సరళీకృత పారిశ్రామిక విధానాలను అమల్లోకి తేవడంతో ఇతర రాష్ట్రాల పెట్టుబడి దారులు కూడా ఇక్కడకు వస్తున్నారు. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.

గ్రామ వార్డు సచివాలయాలతో
సచివాలయ వ్యవస్థ దేశంలోనే ఒక చరిత్ర. ప్రభుత్వాఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే సంప్రదాయానికి జగన్‌ సర్కార్‌ స్వస్తి పలికింది. ప్రతి రెండువేల మంది జనాభాకు గ్రామ/వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఎలాంటి సమస్యనైనా గ్రామం నుంచే పరిష్కరించుకునేలా చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1,207 సచివాలయాలను ఏర్పాటు చేసింది. రేషన్‌ కార్డు నుంచి ఇంటిపట్టా వరకూ అన్ని పనులకూ సచివాలయమే వేదిక అయ్యింది. అలాగే వేలాది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది.

మరిన్ని వార్తలు