ప్చ్‌.. మీ పనితీరు బాగోలేదు

7 Jun, 2023 12:20 IST|Sakshi

పుట్టపర్తి అర్బన్‌: ‘‘బుక్కపట్నం, కదిరి వెస్ట్‌, ధర్మవరం, గాండ్లపెంట, తనకల్లు, ఓడీసీల్లో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు సరిగా లేదు. సీడీపీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఇకపై పనితీరు మార్చుకోవాలి. బుధవారం నాటికి నిర్దేశిత లక్ష్యాల సాధనలో కొంతైనా పురోగతి చూపాలి’’ అని కలెక్టర్‌ అరుణ్‌బాబు అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని కోర్టు కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ నెల 8వ తేదీన (గురువారం) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో వీడియో కాన్ఫరెన్స్‌ ఉంటుందని, ఆలోపు జిల్లాలోని అన్నిశాఖల అధికారులు సమగ్ర సమాచారంతో నివేదికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ పథకాల నిర్దేశిత లక్ష్యాల సాధనకు అధికారులు ప్రణాళికా బద్ధంగా పని చేయాలన్నారు.

లక్ష్య సాధనలో పురోగతి లేకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్నారు. ఈ క్రమంలోనే ఐసీడీఎస్‌ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే ధర్మవరం అర్బన్‌, కదిరి అర్బన్‌, పుట్టపర్తి అర్బన్‌, హిందూపురం అర్బన్‌, గోరంట్ల, మడకశిర మండలాల్లోనూ పనులు పురోగతి సరిగా లేదన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, చిన్నపిల్లలు, బాలికల్లో రక్తహీనత, పోషకాహార లోపం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లలు, 10 నుంచి 19 ఏళ్లలోపు బాలికల్లో రక్త హీనత, పోషకాహారలోపం లేకుండా చూడాలన్నారు.

మధ్యాహ్న భోజనానికి సంబంధించి అంగన్‌వాడీ, పాఠశాలల్లో పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలన్నారు. అలాగే గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమంపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బడి మానేసిన చిన్నారులపై దృష్టి సారించి వారందరికీ స్కూళ్లలో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లోని మరుగుదొడ్లు వినియోగంలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

ఇక ‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో ఎమ్మెల్యేలు ద్వారా గుర్తించిన 133 పనులకు ఆమోదం తెలిపామన్నారు. కార్యక్రమంలో సీపీఓ విజయ్‌కుమార్‌, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగప్రసాద్‌, డీఎంహెచ్‌ఓ కృష్ణారెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ లక్ష్మీకుమారి, నోడలాఫీసర్‌ శివారెడ్డి, జిల్లా కోర్డినేటర్‌ యవవాణి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు