ఎదిగిన కొడుకులు.. అయినా అనుమానపు విషమెక్కి..

27 Mar, 2023 01:32 IST|Sakshi

శ్రీకాకుళం: నరసన్నపేట గాంధీనగర్‌కు చెందిన కరుకోల లక్ష్మి(48) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. అద్దెకు ఉంటున్న ఇంటిలో నైలాన్‌ తాడుతో ఉరి వేసుకున్నారు. భర్త నారాయణ మూర్తి వేధింపులకు తాళలేక ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మి, నారాయణమూర్తిలకు ముప్పై ఏళ్ల కిందట వివాహమైంది.

వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరంతా ఉద్యోగాల రీత్యా వేరే ప్రాంతాల్లో ఉంటున్నా రు. ఇంట్లో దంపతులిద్దరూ నివాసముంటున్నారు. నారాయణమూర్తి లక్ష్మిని వేధింపులకు గురి చేసేవాడని, నిత్యం కొట్టేవాడని లక్ష్మి సోదరి ఆదెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను బయటకు వెళ్లినప్పుడల్లా ఇంటికి రెండు వైపులా తాళాలు వేసి వెళ్తారని, శనివారం ఉదయం కూడా ఆయన బయటకు వెళ్తూ ఇంటికి తాళాలు వేసి వెళ్లారని, సాయంత్రం తిరిగి వచ్చే సరికి లక్ష్మి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని తమకు చెప్పడంతో వచ్చి చూశామని ఆదెమ్మ తెలిపారు.

పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఆదెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట ఎస్‌ఐ వై. సింహాచలం ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు