మూడు ఆలయాల్లో చోరీ

25 May, 2023 01:06 IST|Sakshi
శివాలయం వద్ద వివరాలు సేకరిస్తున్న క్లూస్‌టీం, కమిషనర్‌ సూర్యప్రకాశరావు

గార : మండలంలోని శాలిహుండం కొండపై వేణుగోపాలస్వామి ఆలయంతో పాటు వేంకటేశ్వర స్వామి ఆలయం, శివాలయాల్లో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. కొండపై రాత్రిపూట ఎవరూ ఉండకపోవడాన్ని గుర్తించిన దుండగులు తొలుత వేంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీని పగలగొట్టి నగదును దోచుకున్నారు. అనంతరం వేణుగోపాలస్వామి ఆలయంలోకి చొరబడి తులం బంగారం వస్తువులు, 80 తులాల వెండి ఆభరణాలు, శఠగోపం, వెండిపళ్లెం తదితర వస్తువులు పట్టుకుపోయారు. శివాలయంలోనూ వెండి వస్తువులు మాయమయ్యాయి. మూడు ఆలయాల్లోనూ హుండీలను పగలగొట్టి నగదు దోచుకున్నారు. అక్కడే ఉన్న ధర్మకర్త సుగ్గు మధురెడ్డి గృహంలోకి చొరబడి బీరువాను పగలగొట్టారు. సీసీ ఫుటేజీ ఉన్న సీపీయూను తీసుకెళ్లారు. బుధవారం ఉదయం అర్చకులు దేవాలయానికి వెళ్లగా తలుపులు తెరచి ఉండటంతో ధర్మకర్త మధురెడ్డికి, పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా దేవదాయ శాఖ కమిషనర్‌ హరిసూర్యప్రకాశరావు ఆలయానికి చేరుకుని చోరీ ఘటనపై ఆరా తీశారు. శ్రీకాకుళం నుంచి క్లూస్‌టీం వివరాలు సేకరించారు. సమీప సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఏఎస్సై లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మండలంలో ఇటీవల దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

శాలిహుండం కొండపై దొంగలు పడ్డారు

సీసీ ఫుటేజీ పట్టుకెళ్లిన దుండగలు

విలువైన ఆభరణాలు మాయం

మరిన్ని వార్తలు