చెన్నై యువతి లండన్‌లో కిడ్నాప్‌ 

26 Aug, 2020 08:24 IST|Sakshi

సాక్షి, చెన్నై : చెన్నైకు చెందిన ఓ సంపన్న ఇంటి యువతిని ప్రేమ పేరుతో లండన్‌లో ఓ ముఠా ట్రాప్‌ చేసింది. ఆమెను కిడ్నాప్‌ చేసి, మతమార్పిడితో బంగ్లాదేశ్‌కు తరలించిన విషయం వెలుగు చూసింది. చెన్నైలోని ఆ సంపన్న కుటుంబానికి కిడ్నాపర్ల నుంచి వచ్చిన బెదిరింపుతో ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. చెన్నైకు చెందిన ఓ సంపన్న కుటుంబం యువతి ఉన్నత చదువు నిమిత్తం లండన్‌ వెళ్లారు. ఆ యువతిని ప్రేమ పేరిట నజీష్‌ అనే యువకుడు ట్రాప్‌ చేశాడు. అతడి వలలో పడ్డ ఆ యువతి చివరకు మత మార్పిడి చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.

ఆ యువకుడి తండ్రి షౌకత్‌ హుస్సేన్, స్నేహితులు యూనిష్‌ మాలిక్, నవాజ్‌లతో పాటు మరి కొందరు వీరికి సహకరించారు. ఉన్నత చదువుల నిమిత్తం లండన్‌కు వెళ్లిన తమ కుమార్తె మతమార్పిడితో బంగ్లాదేశ్‌కు తరలించబడ్డట్టుగా చెన్నైలోని తల్లిదండ్రులకు సమాచారం అందింది. అయితే, ఆ యువతిని కిడ్నాప్‌ చేయడం లక్ష్యంగానే ఆ యువకుడు, అతడి తండ్రి, స్నేహితులతో పాటు ముంబై పోలీసుల వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్న జకీర్‌ నాయక్‌ ప్రేమ నాటకం ఆడినట్టు వెలుగు చూసింది.

ఆ యువతిని కిడ్నాప్‌ చేసినట్టు, విడుదల చేయడానికి కొన్ని కోట్లను డిమాండ్‌ చేసినట్టు సమాచారం. సంపన్న కుటుంబం వ్యక్తి కావడంతో తన పలుకుబడితో వ్యవహారాన్ని ఢిల్లీ స్థాయిలోకి ఆ యువతి తండ్రి తీసుకెళ్లారు. దీంతో ఎన్‌ఐఏను కేంద్రం రంగంలోకి దించింది. యువతి కిడ్నాప్‌ విషయంగా ఎన్‌ఐఏ తన విచారణను వేగవంతం చేసింది. అయితే, తమ బిడ్డ సురక్షితంగా చెన్నైకు రావాలని ఆ కుటుంబం ప్రార్థనల్లో లీనమైంది. ఈ కుటుంబం పూర్వీకం ఉత్తరాది అయినా, కొన్నేళ్ల క్రితం చెన్నైలో స్థిరపడ్డారు. ఆ యువతి విలాసవంతమైన జీవితం, ఆడంబరాలు, విచ్చల విడితనం వెరసి పథకం ప్రకారం కిడ్నాప్‌ చేసినట్టు తేలింది. 

మరిన్ని వార్తలు