సాంకేతిక రంగాల్లో మనదే కీలక పాత్ర

13 Mar, 2021 02:47 IST|Sakshi

వరంగల్‌లో ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతీయ యువత కీలకపాత్ర వహిస్తోందని.. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో రాణిస్తూ సత్తా చాటుతోందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో యువ శాస్త్రవేత్తలు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, నిపుణుల కొరత ఉన్నా.. మన దేశం మాత్రం 1.3 బిలియన్‌ జనాభాతో ఒక అత్యున్నత స్థాయి శక్తిగా ఆవిర్భవించే స్థాయికి చేరిందని తెలిపారు.  (చదవండి: బస్సులో గవర్నర్‌ తమిళిసై ప్రయాణం)

దార్శనికత, ముందు చూపు ఉన్న ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకెళ్తోందని, ఇందులో యువతే కీలకపాత్ర అని వెల్లడించారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’వేడుకలను గవర్నర్‌ తమిళిసై శుక్రవారం హన్మకొండలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రారంభించారు. తొలుత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్‌ జాతీయ పతాకాన్ని ఎగుర వేశాక రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్, ఎంపీలు పసునూరి దయాకర్, బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజ్‌ సారయ్య, వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, జెడ్పీ చైర్మన్‌ ఎం. సుధీర్‌ కుమార్, జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీసు కమిషనర్‌ పి. ప్రమోద్‌ కుమార్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు