కరోనా విపత్తులో సీఎం జగన్‌ సేవలు భేష్‌

26 Apr, 2021 02:30 IST|Sakshi

రోగులకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు

కర్ణాటకలోనూ ముఖ్యమంత్రి యడియూరప్ప అమలు చేయాలి

స్ఫటికపురి మహా సంస్థాన మఠాధ్యక్షుడు నంజావదూత స్వామీజీ డిమాండ్‌ 

తుమకూరు: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై స్ఫటికపురి మహా సంస్థాన మఠాధ్యక్షుడు నంజావదూత స్వామీజీ ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా రోగులకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందిస్తున్నారని అభినందించారు. కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా రాష్ట్రంలో ఏపీ సీఎం జగన్‌లా కోవిడ్‌ రోగులకు ఉచిత చికిత్సనందించి వారి ప్రాణాలను కాపాడాలని డిమాండ్‌ చేశారు.

ఆదివారం కర్ణాటకలోని తుమకూరు జిల్లా శిరా తాలూకా పట్టనాయకనహళ్లిలో ఉన్న స్ఫటికపురి మహాసంస్థాన మఠంలో స్వామీజీ మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి వల్ల కర్ణాటకలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నిరుపేదలు చికిత్స లభించక మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం ఏపీ అప్పుల్లో ఉన్నా అక్కడ సీఎం వైఎస్‌ జగన్‌ ఔదార్యంతో ఎంతో మంది కరోనాకు ఉచితంగా చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. కర్ణాటకలో అన్ని ఆస్పత్రుల్లో కరోనాకు ఉచిత వైద్యసేవలు అందించాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు