వారిని కాపాడేందుకు ఒంటిపై చీర‌ల‌ను తాడుగా..

11 Aug, 2020 19:09 IST|Sakshi

చెన్నై: క‌రోనా భ‌యంతో ఇంటి మ‌నిషినే ప‌రాయిగా చూస్తోన్న ఈ రోజుల్లో ఓ ముగ్గురు మ‌హిళ‌లు యువ‌కుల ప్రాణాలు కాపాడి వారి పాలిట‌ దేవ‌త‌లుగా నిలిచారు. నీళ్ల‌లో కొట్టుకుపోతున్న‌ యువ‌కుల‌ను కాపాడేందుకు ఒంటిపై ఉన్న చీర‌ల‌ను అందించి అమ్మ‌గా మారి వారికి పున‌ర్జ‌న్మ ఇచ్చారు. త‌మిళ‌నాడులో ఆగ‌స్టు 6న జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. భారీ వ‌ర్షాల కార‌ణంగా పెరంబ‌ళూర్ జిల్లాలోని కొట్టారై డ్యామ్ నీటి మ‌ట్టం పెరిగింది. శిరువాచూర్ గ్రామానికి చెందిన 12 మంది యువ‌కులు ఆ డ్యామ్‌కు స‌మీపంలోనే క్రికెట్ ఆడుకునేందుకు వెళ్లారు.  (కస్టడీ డెత్‌ కేసు: కరోనాతో ఎస్‌ఎస్‌ఐ మృతి)

అనంత‌రం వారు ఆ డ్యామ్‌లో స్నానాలు చేసేందుకు వెళ్ల‌గా అక్క‌డున్న ముగ్గురు మ‌హిళ‌లు వారిని హెచ్చ‌రించారు. ఇంత‌లో న‌లుగురు కుర్రాళ్లు ప్ర‌మాద‌వ‌శాత్తూ డ్యామ్‌లో ప‌డిపోయారు. దీంతో వారిని ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. అక్క‌డ తాడు వంటివి క‌నిపించ‌లేదు. మ‌రోవైపు వాళ్లు నీళ్ల‌లో మునిగిపోతుండ‌టంతో ఇక క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌కుండా మ‌హిళ‌లు వారి ఒంటిపై ఉన్న చీర‌ల‌ను తీసి డ్యామ్‌లో ఉన్న కుర్రాళ్ల‌కు అందేలా చేశారు. దీంతో ఇద్ద‌రి కుర్రాళ్ల ప్రాణాలు కాపాడ‌గలిగారు. కానీ దుర‌దృష్టం వ‌ల్ల మ‌రో ఇద్దరు జ‌ల‌స‌మాధి అయ్యారు. ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన ఇద్ద‌రిని కార్తిక్‌, సెంతిల్వెల‌న్‌గా, మ‌ర‌ణించిన‌ వారిని పవిత్ర‌న్‌, రంజిత్‌లుగా గుర్తించారు. (పైత్యం ఎక్కువైతే ఇలాంటివే జ‌రుగుతాయి)

మరిన్ని వార్తలు