వేలూరు: తిరువణ్ణామలై జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు.. వెరయూరు సమీపంలోని పెరియకల్లపాడికి చెందిన విఘ్నేష్(29), దురై భార్య చిత్ర(24), వారి బంధువు విల్లుపురం జిల్లా కండాచ్చిపురం తాలూకా కొడుకపట్టుకు చెందిన రామలింగం భార్య ఇందిర(44) కలిసి మృతిచెందిన వ్యక్తిని చూసేందుకెఉ బైక్లో వచ్చారు. వెరయూరు బస్టాండ్ వద్ద వేలూరు నుంచి తిరువణ్ణామలై వైపు వెళుతున్న ప్రైఉవేటు బస్సు ఢీకొంది. ఇందిర అక్కడికక్కడే మృతి చెందగా చిత్ర, విఘ్నేష్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా చిత్ర, విఘ్నేష్ మృతి చెందారు. వెరయూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా తిరువణ్ణామలై జిల్లా సాతనూరు గ్రామానికి చెందిన కామాక్షి(40) కుమారుడు శక్తివేల్(15) తిరువణ్ణామలై ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం ఉదయం ఆస్పత్రి నుంచి ఇంటికి కారులో బయలు దేరారు. కారులో శక్తివేల్, కామాక్షి, సంజయ్(13), సెల్వం (42) ఉన్నారు. కారును డ్రైవర్ ఇళయరాజ నడుపుతున్నాడు. కోలపాడి వద్ద మినీ వ్యాన్ ఢీకొనడంతో శక్తివేల్, కామాక్షి, డ్రైవర్ ఇళయరాజ్ అక్కడికక్కడే మృతి చెందారు. సెల్వం, సంజయ్ తీవ్రంగా గాయపడ్డారు. తిరువణ్ణామలై తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.