కొరుక్కుపేట: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రపంచం గర్వించదగ్గ గాయకుడని భారత ప్రభుత్వం ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం – నెల్లూరు సంచాలకులు డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్ కొనియాడారు. ఈ మేరకు డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు, ద్వితీయ వార్షికోత్సవం–2023 లను ఘనంగా నిర్వహించారు. స్థానిక పెరంబూర్లోని డీఆర్బీ సీసీస మహోన్నత పాఠశాల వేదికగా ఆదివారం జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాడ భూషి సంపత్ కుమార్ పాల్గొని కళాకారులకు, విద్యార్థులకు ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్పీబీ అభిమానులు అంతా కలిసి సంఘాన్ని ఏర్పాటు చేసి కళాకారులను సత్కరించుకోవటం అభినందనీయం అని పేర్కొన్నారు. ఎస్పీబీ తెలుగు వారు కావడం మన అదృష్టం అని, ఆయనకు తెలుగు భాష మీద, సాహిత్యం మీద అపారమైన అభిమానం అన్నారు.విశిష్ట అతిఽథి జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ ఎస్పీబీ కీర్తి ప్రతిష్టలు మరింతగా ఇనుమడింప జేయాలని కోరారు. మద్రాసు వర్శిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు విస్తాలి శంకర రావు ఉగాది విశిష్టతను తెలియజేశారు. పారిశ్రామికవేత్త ఉమా మహేశ్వర రెడ్డి, సంగీత దర్శకులు ఎంఆర్ సుబ్రహ్మణ్యం, ప్రముఖులు షణ్ముఖ సుందరం, అధ్యక్షులు సి. మోహన్ పాల్గొన్నారు. చివరిగా నృత్య ప్రదర్శనలు, బాలు పాటలతో నిర్వహించిన సంగీత విభావరి అలరించింది.