తమిళసినిమా: ప్రఖ్యాత కవి పులమైపిత్తన్ మనవడు దిలీపన్ పుగళేంది కథానాయకుడిగా నటించిన చిత్రం ఎవన్.నటి దీప్తీ మానే నాయకిగా నటించిన ఇందులో నటుడు జేకే.సంజిత్, ఉజ్జయినీరాయ్, గానాబాలా, పాండిరవి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సన్లైట్ సినిమాస్ పతాకంపై నవ దర్శకుడి దురైమురుగన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి శివరామన్ ఛాయాగ్రహణం, ఏకే.శశిధరన్ సంగీతాన్ని అందించారు. చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏప్రిల్ 7న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చైన్నెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర కథానాయకుడి దిలీపన్ పుగళేంది మాట్లాడుతూ తాను నటుడిగా పరిచయం కావడం యాదృచ్చికమేనన్నారు. బేసిక్గా తాను బైక్ రేసన్ అని, 2009లో బైక్ రేసింగ్ పోటీలో పాల్గొని కప్ గెలుచుకున్నానని చెప్పారు. అదేవిధంగా వీలింగ్ అనబడే ఒంటి చక్ర వాహనంతో 13 కిలోమీటర్ల నడిపి గిన్నిస్బుక్లోకి ఎక్కానన్నారు. ఆ తరువాత అనుకోకుండా సినీరంగంలోకి ప్రవేశించానని చెప్పారు. అందుకు ముందు నటనలో శిక్షణ పొందినట్లు చెప్పారు. అలా 2012లో జయశీలన్ దర్శకత్వంలో పళ్లికూడం పోగామలే చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయినట్లు చెప్పారు. ఇది రెండో చిత్రమని చెప్పారు. ఈ చిత్రం వేరే నిర్మాత నిర్మించతల పెట్టారని, కొన్ని కారణాల వల్ల తానే పూర్తి చేయాల్సి వచ్చిందనీ చెప్పారు. తన చిత్రం ఆగిపోరాదని తన బామ్మ అప్పట్లోనే రూ.30 లక్షలు ఆ నిర్మాతకు ఇచ్చిందన్నారు. కాగా తల్లి కొడుకుల అనుబంధం ఇతి వృత్తంగా రూపొందించిన చిత్రం ఎవన్ అని చెప్పారు. చిత్రం సంతృప్తిగా వచ్చిందన్నారు. తదుపరి ఆంటనీ అనే పాన్ ఇండియా చిత్రంలో నటించబోతున్నట్లు చెప్పారు. ఇందులో పోలీస్ అధికారిగా నటించనున్నట్లు తెలిపారు. తన వరకూ తాత, బామ్మలే తనకు గురువులు అని నటుడు దిలీపన్ పుగళేంది పేర్కొన్నారు.