సాక్షి, చైన్నె: తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టిలోని బీజేపీ నాయకుడు శివంది నారాయణన్ ఇంట్లో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఆయన వద్ద తీవ్ర విచారణ జరుగుతోంది. వివరాలు.. తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి రాజీవ్ గాంధీ నగర్కు చెందిన శివంది నారాయణన్ బీజేపీ జిల్లాలో విభాగంలో కీలక నేతగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, బిల్డింగ్ కాంట్రాక్ట్, భవనాల కొనుగోలు విక్రయాలు, పీఎం గృహ నిర్మాణ పథకం గృహాల కాంట్రాక్టు పనులు చేపడుతున్నారు. ఈ పరిస్థితులలో గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఐదుగురు ఈడీ అధికారులు ఆయన ఇంటికి వచ్చారు. ఇంట్లో సోదాలకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఇంట్లో శివంది నారాయణన్ భార్య, పని వాళ్లు మాత్రమే ఉన్నారు. దీంతో శివంది నారాయణన్కు ఫోన్ చేసి ఇంటికి రావాలని ఆదేశించారు. తొలుత ఆయన తొలుత నిరాకరించినా.. తర్వాత అధికారులు హెచ్చరికలకు తలొగ్గక తప్పలేదు. అదే సమయంలో ఈడీకి వ్యతిరేకంగా బీజేపీ నాయ కులు, కార్యకర్తలు, ఆయన బంధువులు పెద్దసంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. సోదాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. దీంతో కోవిల్ పట్టి పోలీసులు రంగంలోకి దిగి భద్రత కల్పించారు. ఆయన నివాసంలో రాత్రి వరకు సోదాలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీకి అన్నామలై
సాక్షి, చైన్నె: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వెళ్తూ..వెళ్తూ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు లేరని వ్యాఖ్యానించారు. బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యలు ఇటీవల కాలంగా ఆ పార్టీలోనే అసంతృప్తిని రగిల్చిన విషయం తెలిసిందే. ఆయనపై సీనియర్లు ఢిల్లీ అఽధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో గురువారం ఉదయం హుటాహుటిన అన్నా మలై ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు ఆయన హస్తిన వెళ్లినట్టు సమాచారం. విమానాశ్రయంలో మీడియాతో అన్నామలై మాట్లాడుతూ, కూటమిలోని పార్టీలు బలపడుతుంటే, ఎవ్వరూ చూస్తూ ఊరుకోరని పరోక్షంగా అన్నాడీఎంకేను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ బల పడుతుంటే ఎవరికై నా ఇష్టం ఉంటుందా? అని ఓ ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేశారు. తన లక్ష్యం బీజేపీ బలోపేతం మాత్రమేనని స్పష్టం చేశారు. రాజకీయా లలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని వ్యాఖ్యలు చేశారు. తాను అవినీతికి పాల్పడినట్లు, లంచం తీసుకున్నట్లు నిరూపించేందుకు సిద్ధమా? అని ఆరోపణలు గుప్పించిన వారికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ హాస్యనటుడు వడివేలు కామెడీని తలపిస్తోందంటూ విమర్శించారు.
తిరువళ్లూరులో భారీ వర్షం
తిరువళ్లూరు: తిరువళ్లూరు పరిసర ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురవడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గత 10 రోజుల నుంచి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటూ సాయంత్రం సమయంలో వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం సమయంలో తీవ్రమైన ఎండలు, సాయంత్రం సమయంలో వర్షాలు పడుతున్నాయి. గురువారం తిరువల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతా ల్లో రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో మామిడి తోటల్లో పెద్దఎత్తున పూత, పిందెలు రాలిపోయాయి. కాగా తిరువళ్లూరులో కురిసిన వర్షానికి వీరరాఘవుని ఆలయం, పెద్దకుప్పం బస్టాండు, బజారువీధుల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారుల రాకపోకలకు అంతరాయం కలిగింది.
న్యూస్రీల్